మరో వివాదంలో చంద్రబాబు: మత్తయ్యకు రక్షణ, ఎపి పోలీసులు?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో సంభవిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటుకు ఓటు కేసులో నిందితుడైన మత్తయ్యకు ఎపి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మోహరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
ఓటుకు నోటు కేసులో ఎసిబి నుంచి పరారై పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్తయ్య రక్షణ పొందారని, పైగా ఆయనకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, మత్తయ్య ఫిర్యాదుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఉల్టా కేసులు బనాయిస్తున్నారని, ఇదంతా ఎపి సిఎం చంద్రబాబు ప్రోద్బలంతో జరుగుతోందని తెలంగాణ వాదిస్తోంది. ఇది చంద్రబాబును చిక్కుల్లో పడేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. మత్తయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఎసిబికి అప్పగించక తప్పదని అంటున్నారు.

కాగా, ఓటుకు నోటు కేసు పరిణామాల నేపథ్యంలో హైదరాబాదులో చంద్రబాబు నివాసం వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు భద్రత కల్పించడంపై ఇప్పటికే తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో తమకు పోలీసులున్నారని, ఎసిబి ఉందని చంద్రబాబు వాదించినప్పటికీ జ్యురిడిక్షన్ మాత్రం తెలంగాణ పోలీసులది, ఎసిబిది మాత్రమేనని చట్టం స్పష్టంగా చెబుతోందని అంటున్నారు. ఎపి పోలీసులకు హైదరాబాదులో జ్యురిడిక్షన్ లేదని అనురాగ్ శర్మ వాదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గానీ, ఎపి అధికారులకు గానీ ఏ విధమైన అధికారాలను కట్టబెట్టలేదు. తమ రాష్ట్రంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన రక్షణ బాధ్యత తమదే గానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులది కాదని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు వాదిస్తున్నారు.
చంద్రబాబు వ్యవహార శైలి వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. జ్యురిడిక్షన్ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాటించక తప్పడం లేదని అంటున్నారు. ఏమైనా, చంద్రబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.












Click it and Unblock the Notifications