క్లైమాక్స్కు చేరుకున్న నోటుకు ఓటు: డిజిపితో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు క్లైమాక్స్ దశకు చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం రాష్ట్ర డిజిపి జెవి రాముడితో సమావేశమయ్యారు. డిజిపితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
నోటుకు ఓటు కేసుపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో ఫోన్ మాట్లాడిన గొంతు తనదేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ తేల్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు వారితో తదుపరి పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డు ట్యాపింగ్ వెర్షన్ కాదని, అది ఒక ఫోన్ నుంచి మరో ఫోన్కు వచ్చిన కాల్ను రికార్డు చేసిన టేప్ అని ఎఫ్ఎస్ఎల్ ధ్రువీకరించిందని అంటున్నారు. టిజిపి నేతలు ఆరోపిస్తున్నట్లుగా వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాటలను ఏరి కూర్చి గుదిగుచ్చింది కాదని కూడా ఎఫ్ఎస్ఎల్ తేల్చినట్లు సమాచారం.

ఈ పరిస్థితిలో తెలంగాణ ఎసిబి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గురువారం రాత్రి లేదా శుక్రవారంనాడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని, నోటీసు అందుకున్న నాటి నుంచి 72 గంటల్లో విచారణకు హాజరు కావాలని కోరబోతున్నామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినందు వల్ల బిజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు గడువు ఇస్తామని ఎసిబి అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
చంద్రబాబు కన్నా ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులను, ఇద్దరు శాసనసభ్యులను, ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications