ఓటుకు నోటు కేసు ఊపందుకున్న వేళ: గవర్నర్తో సుజనా కీలక భేటీ
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి బుధవారం గవర్నర్ నరసింహాన్తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఊపందుకున్న తరుణంలో గవర్నర్తో సుజనా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం ఢిల్లీలో అమిత్ షా నివాసంలో జరిగిన కేంద్ర మంత్రుల సమావేశానికి హాజరైన సుజనా ఏపీకి అందించాల్సిన సాయంపై ఓ నివేదికను అందించారు.
ఈ క్రమంలో ఏపీకి అందించాల్సిన సాయంపై కేంద్రం ఓ ముసాయిదా సిద్ధమవుతున్న తరుణంలో అందులో పొందుపరిచిన అంశాలను గవర్నర్ నరసింహాన్కు వెల్లడించేందుకే బుధవారం ఆయన హైదరాబాద్కు వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో అమిత్ షా, జైట్లీలతో జరిగిన చర్చల సారంశాన్ని ముసాయిదాలోని అంశాలను గవర్నర్కు వివరించారని సమాచారం.
మరోవైపు ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్గా మారడం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హోదా గోదాలోకి దిగడంతో సెప్టెంబర్ 2వ తేదీన ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్ను కలిసి తాజా పరిస్థితులను సుజనా వివరించినట్లు సమాచారం.
మంగళవారం మీడియాతో మాట్లాడిన సుజనా ప్రత్యేక హోదా సహా విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుందని ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి భవిష్యత్పై ఉత్కంఠ నెలకొంది.
మంగళవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఏజీ రామకృష్ణారెడ్డి, ఏసీబీ డీజీ ఏకేఖాన్ కూడా గవర్నర్తో ఈ కేసు విషయంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
ఓటుకు నోటు కేసుపై ఉత్కంఠ: ఏం జరుగుతోంది, చంద్రబాబు ప్లాన్ ఏంటీ?
కోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనిపై న్యాయ సలహా కూడా తీసుకుంటున్నామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ భేటీలతో ఏం చర్చించారనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకుని గవర్నర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.