శివాజీ, పవన్లతో బిజెపికి చంద్రబాబు చిక్కులు: ఏం చేస్తుంది?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరు పట్ల గత కొంత కాలంగా బిజెపి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తాను కర్ర విరగకుండా పాము చావకుండా అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారనే అభిప్రాయం ఉంది. పైగా, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఈ విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బంది వల్ల ఆయన చిరాకు ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడాల్సిన అనివార్యతలోకి పోవడం వెనక చంద్రబాబు పరోక్ష పాత్ర ఉందని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన సినీ నటుడు శివాజీ పలుమార్లు ప్రత్యేక హోదా సాధించడానికి ముందుకు రావాలని పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ముందు ఉంటే, తాము మద్దతిస్తామని శివాజీ అన్నారు. శివాజీ చేసిన దీక్షకు చంద్రబాబు నేరుగా మద్దతు ప్రకటించారు.
అదలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా బలపడే ఉద్దేశంతో బిజెపి ఉంది. దానికి చంద్రబాబు ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక హోదా వంటి విషయాలను ఆసరా చేసుకుని బిజెపి ప్రతిష్టను దెబ్బ తీయడానికి చంద్రబాబు పరోక్షంగా శివాజీ వంటివారికి సహకరించారని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్థితిలో బిజెపి నోటుకు ఓటు కేసులో వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.
మహాసంకల్ప సభలో చంద్రబాబు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తోందని రెండు మూడు సార్లు అన్నారు. మోడీని విమర్శించిన కాంగ్రెసు నాయకులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకు ముందు, కేంద్ర సహాయం పట్ల కాస్తా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మాట్లాడుతూ ఉండేవారు. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు నోటుకు ఓటు కేసు ప్రభావమేనని అంటున్నారు.
నోటుకు ఓటు కేసు నుంచి బయటపడడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం గానీ బిజెపి నాయకులు గానీ చంద్రబాబుకు సహకరిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నోటుకు ఓటు కేసు వ్యవహారానికి ఇప్పుడు ఢిల్లీ వేదికగా మారింది. బిజెపి నాయకత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ సహకరించే విషయంపై చంద్రబాబు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ఈ రాష్ట్ర బిజెపి నాయకత్వం ఇష్టంగా లేదని అంటున్నారు. టిడిపితో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచనలోనే తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకత్వం ఉంది. నోటుకు ఓటు కేసును ఆసరా చేసుకుని బిజెపి టిడిపితో తెగదెంపులు చేసుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.