కులాల కుంపట్లు: కెసిఆర్ పంథాలో చంద్రబాబు?
హైదరాబాద్: రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పంథాలో పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తానేమీ మాట్లాడకుండా వాటిని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడమే ఆ పంథా.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ తలపెట్టిన ఆందోళనను, కాపు రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ పద్మనాభం రెండోసారి ఒడిగట్టిన ఆందోళనను చంద్రబాబు కెసిఆర్ పంథాలోనే అదుపు చేసినట్లు ప్రచారం సాగుతోంది.
కెసిఆర్కు పొగడ్తలు, ఇబ్బందిపడిన బాబు (పిక్చర్స్)
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆలస్యంగానైనా సరే, ఒక వేళ ముద్రగడ ఆందోళన తర్వాతనైనా సరే, చంద్రబాబు ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. కాపుల కోసం ఓ కార్పొరేషన్ను ఏర్పాటుచేసింది. బడ్జెట్లో వారికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. ఆర్థికంగా ఆదుకునేందుకు రుణాల మంజూరును కూడా చేపట్టింది.
కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా తిరిగి మరోసారి ముద్రగడ ఆమరణదీక్షకు పూనుకోవటం చంద్రబాబుకు చిరాకు పెట్టింది. ఇదే సమయంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ చంద్రబాబు స్వస్థలమైన నారావారిపల్లె నుంచి రథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఇది కూడా చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కావాల్సి ఉంది. ఇందుకోసం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలనీ, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనీ డిమాండ్ చేస్తూ మందకృష్ణ మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ పేరిట మరికొన్ని సంఘాలు ఈలోగా ముఖ్యమంత్రిని కలుసుకున్నాయి.
ఏబీసీడీ వర్గీకరణ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతాననీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ నేతలు ప్రకటించారు. ఈలోగా మందకృష్ణ తన ఉద్యమాన్ని నారావారిపల్లె నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధంచేసుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా సరిహద్దులకు చేరుకున్న వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆయన చేపట్టిన రథయాత్రకు అనుమతిలేదని స్పష్టంచేశారు. సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినందునే పోలీసులు ఓ అడుగు ముందుకేశారని చెబుతున్నారు. మందకృష్ణని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లి దించి వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు మద్ధతు పలికిన మందకృష్ణకు ఆంధ్రలో పనేమిటని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు ప్రశ్నించారు కూడా.
ఇదిలాువటే, కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 11వ తేదీన తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షని కూడా వాయిదా వేసినట్టు స్వయంగా ముద్రగడ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల కోసం నిరాహారదీక్షను వాయిదావేసినట్టు ముద్రగడ ప్రకటించినప్పటికీ దీనివెనుక బలమైన కారణమే ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు.
ముద్రగడ చేస్తున్న డిమాండ్లలో ప్రభుత్వం తక్షణం రిజర్వేషన్ కల్పించటం మినహా, మిగిలినవన్నీ నెరవేర్చిందని. అటువంటప్పుడు దీక్ష ఎలా చేస్తారంటూ క్యాబినెట్లోని కాపు మంత్రులు విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబునుద్దేశించి ముద్రగడ రాసిన లేఖ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది జగన్ స్ర్కిప్ట్ అంటూ ఒకవైపు మంత్రివర్గ సహచరులతో విమర్శలు ఎక్కుపెట్టారు.
మరోవైపు పోలీస్ వ్యూహానికి కూడా ప్రభుత్వం పదునుపెట్టించింది. గతంలో జరిగిన విధ్వంసకాండ వెనుక ఎవరున్నారో కూడా లీకులు ఇచ్చారు. చర్యలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధం, పోలీస్టేషన్లపై దాడి, దహనం, పలు వాహనాలను తగులబెట్టడం వంటి ఘటనల్లో పాల్గొన్నవారి విజువల్స్, ఫొటోలు, ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు సేకరించి సిద్ధంచేశారు.
ముద్రగడ దీక్షను ఎదుర్కోవడానికి కూడా పోలీసులు పకడ్బందీ వ్యూహం రూపొందించారు. ఈ వ్యూహాలేమిటో కూడా ఆయనకు తెలిసేటట్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి వచ్చిన కాపునేతలు దీక్షను వాయిదా వేసుకోవాల్సిందిగా ముద్రగడకి సూచించారు. దీంతో ముద్రగడ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో వివిధ సమస్యలను, పలు సంఘటనలను పోలీసుల ద్వారా డీల్ చేయించడంలో సీఎం కేసీఆర్ విజయవంతమయ్యారని చెబుతారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే పంథాలో పయనించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ రెండు ఉద్యమాలను కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే పోలీసుల ద్వారా వ్యవహారాలు నడిపి చడీచప్పుడు లేకుండా చేశారు.