జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త- ఈ రోడ్డుపైనే పోతారు : ఫ్లెక్సీ వైరల్ - ఎక్కడంటే..!!
ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో కొంత కాలంగా రోడ్ల దుస్థితి పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. రెండున్నారేళ్లుగా ఎక్కడా తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అదే విధంగా జనసేన సైతం కొద్ది నెలల క్రితం సేవ్ ఏపీ రోడ్స్ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది.
రోడ్ల దుస్థితి పైన అగ్రహం
ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజమండ్రి.. అనంతపురంలో శ్రమదానం చేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ రోజు సైతం పవన్ కళ్యాణ్ అమరావతి లో ఆర్ అండ్ బీ రోడ్డు పైన గుంత పూడ్చేందుకు శ్రమదానం చేసారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దీని పైన నిత్యం ఆ రోడ్ల పైన ప్రయాణించే వారిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో..జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగనన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ బోర్డు ఏర్పాటు
'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది' అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు. ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులను ప్రారంభించాలని.. ఇందు కోసం రూ 2,200 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రిపేర్లు చేస్తామంటున్న ప్రభుత్వం
అయితే, ఏ జిల్లాలోనూ ఇప్పటి వరకు రోడ్ల రిపేర్లు ప్రారంభించినట్లుగా సమాచారం లేదు. ఇక, కొద్ది రోజుల క్రితం వరకు భారీ వర్షాల కారణంగా పనులు ప్రారంభించ లేదని అధికారులు చెబతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోతో పాటుగా రోడ్ల దుస్థితి.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ..సెటైర్లతో కామెంట్స్ పోస్టు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి ఏపీ ప్రభుత్వం రోడ్ల విషయంలో ఎటువంటి చర్యలు ప్రారంభిస్తుందో చూడాల్సి ఉంది.