శ్రీనివాసన్కు సిబిఐ కోర్టు సమన్లు, జగన్కు కూడా...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్కు హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్పై సిబిఐ సమర్పించిన చార్జిషీట్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. నవంబర్ 1వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో వైయస్ జగన్కు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన బెయిల్పై మంగళవారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు జగన్ను కూడా ఆదేశించింది. ఐఎఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యానాథ్లకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులోని నిందితులందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది.
కేసులో ప్రధాన నిందితుడు వైయస్ జగన్ కాగా, రెండో నిందితుడు విజయసాయి రెడ్డి. నవంబర్ 1వ తేదీన విజయసాయిరెడ్డిని తమ ముందు హాజరు పరచాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ వ్యవహారాలపై సిబిఐ ఇటీవల కోర్టుకు చార్జిషీట్ను సమర్పించిన విషయం తెలిసిందే.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇండియా సిమెంట్స్ ప్రయోజనాలు పొందిందని, దానికి ప్రతిగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సిబిఐ అభియోగం మోపింది. ఇండియా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో 140 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్కు కాగ్నా, కృష్ణా నదుల నుంచి అక్రమంగా నీటి కేటాయింపులు జరిపారని సిబిఐ చార్జిషీట్లో తెలిపింది.