జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు ఏం తేల్చనుంది... నేడే తీర్పు... సర్వత్రా టెన్షన్.. టెన్షన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ అంశంపై గత కొన్నాళ్లుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బెయిల్ రద్దు అవుతుందని... ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ రఘురామతో పాటు జగన్ ప్రత్యర్థి వర్గం ఆయన్ను పదేపదే టార్గెట్ చేస్తూ వస్తోంది. జగన్ ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని... కాబట్టి ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశమే లేదనే ధీమాలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఈ ఇరువురిలో ఎవరి వాదన నెగ్గబోతుందనేది నేడు తేలిపోనుంది. జగన్ బెయిల్ రద్దు అంశంపై నాంపల్లి సీబీఐ కోర్టు బుధవారం(ఆగస్టు 25) తీర్పు వెల్లడించనుంది.

జగన్ బెయిల్ రద్దుపై రఘురామ పిటిషన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తనపై విచారణ జరుగుతున్న కేసులను,సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ కృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ బయట ఉంటే కేసుల విచారణ సజావుగా సాగడం కష్టమని... కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు. పిటిషన్ వేసినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని... సీఐడీతో తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. రఘురామ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టగా... పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో ఎట్టకేలకు విచారణ ప్రక్రియ ముగిసింది.

జగన్ తరుపు న్యాయవాదుల వాదన...
రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై జగన్ తరుపు న్యాయవాదులు కూడా బలమైన వాదనలు వినిపించారు. పిటిషనర్ తన రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కోర్టును వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజల మధ్య విద్వేషాలు,వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ఆయన ప్రయత్నించారని... ప్రస్తుతం ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడని కోర్టుకు తెలిపారు. జగన్ సీఎంగా ఉన్నారనే కారణం తప్ప... సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్క కారణం కూడా చూపలేకపోతున్నారని పేర్కొన్నారు. సాక్షుల ప్రభావితమని రఘురామ చేస్తున్న వాదన ఊహాజనితమని.. కాబట్టి విచక్షణ మేరకు,చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు.

కౌంటర్ దాఖలు చేయని సీబీఐ
ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ నిరాకరించింది. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. పిటిషన్పై జులై 30న వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. దీంతో బుధవారం న్యాయస్థానం వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దవడం ఖాయమని ఆయన ప్రత్యర్థి వర్గం ఇప్పటికే ఊహాగానాలు మొదలుపెట్టింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే వరకూ చర్చలు వెళ్లాయి. సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకూ ఈ విమర్శలపై ఎక్కడా నేరుగా స్పందించలేదు.

విజయసాయి రెడ్డి పిటిషన్పై విచారణ
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ హోదాలో విజయసాయి రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు,విజయసాయి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. దీనిపై విజయసాయిరెడ్డి ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. రఘురామ కృష్ణరాజు కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని విజయసాయి ఆరోపించారు.రఘురామపై అనేక కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు.
Recommended Video

జగన్పై మొత్తం 38 కేసులు
సీఎం జగన్పై దాదాపు 38 కేసులు ఉన్నాయి. ఇందులో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని కేసులు ఉపసంహరించబడ్డాయి.అయితే ఇది చట్టబద్దంగా లేదని... హడావుడిగా కేసులను మూసివేశారనే విమర్శలు వచ్చాయి. మిగతా కేసుల్లో 11 కేసులపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో మాజీ మంత్రి శంకర్ రావు,మాజీ ఎంపీ ఎర్రంనాయుడు దాఖలు చేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. జగన్పై కేసుల్లో సీబీఐ ఇప్పటివరకూ 11 చార్జిషీట్లు దాఖలు చేయగా ఈడీ ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రస్తుతం ఇవి విచారణ దశలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications