అప్రమత్తంగా ఉండాలంటూ దస్తగిరికి సీబీఐ సూచన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటోంది. ఈ తరుణంలో కడప జిల్లా పులివెందులలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దస్తగిరికి ఉన్న భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. పులివెందులలోని దస్తగిరి నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు భద్రతకు సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని, కేసు ముగింపు దశకు వస్తున్న తరుణంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు తెలియజేయాలని ఆదేశించారు.
వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అవినాష్రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని, దర్యాప్తు సమయంలో అతని నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత/ ప్రింట్ రూపంలో తీసుకోవాలని, అడిగే ప్రశ్నలను ముందుగానే అందించాలంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.

ఇదిలా ఉండగా కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలిసిన పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్లుగా వీటిల్లో రాసివుంది. రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ సునీతమ్మకు స్వాగతం అంటూ తెలుగుదేశం పార్టీ నేతల ఫొటోలతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వీటిని అంటించారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డితోపాటు వైఎస్ వివేకా ఫొటో కూడా ఉంది.












Click it and Unblock the Notifications