పోలీసులపై సీబీఐ దర్యాప్తు సిగ్గు చేటు .. దేవినేని ఉమా
ఏపీలో రోజుకో వ్యవహారంపై రగడ కొనసాగుతుంది. ఇక తాజాగా గుంటూరు ఎస్పీపై సీబీఐ విచారణ చెయ్యాలని హైకోర్టు ఆదేశాలు జారీ చెయ్యటం ఏపీలో పోలీసులపై ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కొందరిని నిర్బంధాలకు గురి చేస్తున్నారని, పోలీసుల వ్యవహార శైలి బాగోలేదని గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆయుధంగా మారాయి.
ఇక ఈ నేపధ్యంలోనే ఏపీలో మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ సర్కార్ పై, అలాగే పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా పోలీసుల తీరులో ఎలాంటి మార్పురావడంలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. పోలీసులపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని హైకోర్టు చెప్పినందుకు సిగ్గుపడాలన్నారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించేస్థాయికి పోలీసులు వెళ్లారని దేవినేని ఉమా దుయ్యబట్టారు.
Recommended Video
అంతేకాదు డీజీపీ ఆఫీసులో నిర్ణయాలు సీఎం సన్నిహితులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.డీజీపీ ఆఫీసులో జగన్ కు చెందిన మానస పుత్రిక అయిన మీడియా పర్యవేక్షణపై సీబీఐ విచారణ చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. సజ్జల సూచనల మేరకే పోలీసుశాఖలో పోస్టింగ్లు ఇస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణాకు వరదలు వచ్చినా సరే ఇప్పటి వరకు వ్యవసాయానికి నీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు దేవినేని ఉమా . ఇక ఇలా వ్యాఖ్యానించానని తనపై సిట్కు ఫిర్యాదు చేసుకున్నా భయపడేది లేదు అని దేవినేని ఉమ తేల్చి చెప్పారు.