వివేకా హత్య కేసు- వైఎస్ కుటుంబ సభ్యుల విచారణ-భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి హాజరు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే వందలాది అనుమానితుల్ని, సాక్ష్యుల్ని విచారించిన సీబీఐ.. ఇప్పుడు వైఎస్ కుటుంబంపై విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ వైఎస్ కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో వివేకా ఇంటి వాచ్ మెన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పలువురిపై కేసులు నమోదు చేసిన సీబీఐ... సునీల్ కుమార్ యాదవ్ అనే నిందితుడిని అరెస్టు చేసి కస్టడీ విచారణ కూడా చేసింది. ఆయన ఇంట్లోనూ సోదాలు పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు సునీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ కుటంబ సభ్యులపై విచారణ మొదలుపెట్టింది.
వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న సీబీఐ విచారణకు ఇవాళ ఆయన సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే వివేకా కుమార్తె వీరిపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సీబీఐ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ హత్య జరిగిన సమయంలో వీరిద్దరూ ఎక్కడున్నారనే దానిపై సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమ సోదరుడితో వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉండేవా, సంబంధాలు ఎలా ఉండేవన్న దానిపై సీబీఐ విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరితో పాటు వైఎస్ కుటుంబంలోని మరో వ్యక్తిని కూడా సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య జరిగిన తర్వాతి రోజు ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో చెప్పారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కావడంతో ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలపై సీబీఐ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిపించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. వివేకా కుమార్తె అనుమానితులుగా చెప్పిన వారందరినీ సీబీఐ ఒక్కొక్కరిగా విచారిస్తోంది. దీంతో పులివెందులలో సాగుతున్న ఈ దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది.
వివేకా హత్య కేసు- వైఎస్ కుటుంబ సభ్యుల విచారణ-భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి హాజరు#andhrapradesh, #kadapa, #pulivendula, #ysvivekanandareddy pic.twitter.com/5CZM7S0IgO
— oneindiatelugu (@oneindiatelugu) August 17, 2021