ఏపీలో వాలంటీర్లకు మళ్లీ ఈసీ ఝలక్ ? కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!
ఏపీలో వైసీపీ సర్కార్ నియమించిన వాలంటీర్లు ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాలంటీర్ల పాత్రపై విమర్శలూ పెరుగుతున్నాయి. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లను ఏడాది పొడవునా చెప్పుచేతల్లో ఉంచుకుంటున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే వారిని తొలగిస్తుండటంతో వాలంటీర్లు కూడా ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లా మారిపోతున్నారు. తాజాగా ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి వాలంటీర్ల పనితీరుపై విమర్శలకు వేదికవుతున్నాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన దాదాపు మూడు లక్షల మంది గ్రామ,వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా పదే పదే ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నాయి. అయితే క్షేత్రస్ధాయిలో వాటిని అమలు చేయాల్సిన కలెక్టర్లు, డీపీవోలు, ఇతర అధికారులు మాత్రం వాలంటీర్లను కట్టడి చేసేందుకు భయపడుతున్నారు. దీంతో వాలంటీర్లపై మళ్లీ మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తగిన ఆధారాలతో విపక్షాలు చేస్తున్న ఫిర్యాదులకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది.

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నఫిర్యాదులు మరోసారి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఈ మేరకు వారిని కట్టడి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జిల్లా కలెక్టర్లకు మరోసారి లేఖలు రాశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వారిని కోరారు. గతంలోని ఇలాంటి ఆదేశాలే ఇచ్చామని, కానీ అమలు కాకపోవడంతో మరోసారి ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు కలెక్టర్లకు మీనా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు ఈసీ ఇచ్చిన ఆదేశాలను వారు ఈసారైనా పాటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications