లక్ష్మీస్ ఎన్టీఆర్ రగడ : సీఈసీ ఉత్తర్వులే అమల్లో : ఆర్జీవీకి సీఈవో లేఖ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల పైన ఇంకా స్పష్టత లేదు. మే ఒకటిన విడుదల చేయాలనే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో..ఈ సినిమా విడుదలయ్యే పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. తాజాగా దీని పైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులే అమల్లో ఉంటాయంటూ ఆర్జీవికి లేఖ రాసారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్కు బ్రేక్..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపిలో విడుదలకు ఇంకా లైన్ క్లియర్ కాలేదు. మే 1న సినిమా విడుదల చేయనున్నట్లు సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి, దర్శకులు రాంగోపాల్ వర్మలు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికలు పూర్తయ్యాయని సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమని ఈ నెల 25న చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మే1 సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. అయితే ఈ ఏప్రిల్ 10వ తేదిన సినిమా విడుదలను ఆపుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఉత్తర్వులు అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇసికి వచ్చిన విజ్ఞప్తికి సమాధానంగా లేఖ రాసారు.

తాజా ఉత్తర్వులు లేవు..
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేసారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయన్నారు ద్వివేదీ. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లేనట్టే. ఇదే సమయంలో సినిమా నిర్మాత..దర్శకులు మాత్రం సీఈవో లేఖ పైన ఎటువంటి ప్రకటన చేయలేదు. కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారం పైన ఆర్జీవి విజయవాడలో మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం..పోలీసులు అడ్డుకోవటం..జగన్ విమర్శలు చేయటం తో దీనికి పొలిటికల్ కలర్ అంటుకుంది. తాజాగా, టిడిపి మహిళా నేతలు దివ్యవాణి, యామినీ శర్మ ఇద్దరూ ఆర్జీవీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు.












Click it and Unblock the Notifications