రాజ్భవన్, అసెంబ్లీ నిర్మాణానికి రూ. 500కోట్లు: డిజైన్లు పంపాలన్న కేంద్రం, బాబు సమీక్ష
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఏపీ కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్న విషయంపై రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ లేఖ రావడం పట్ల ఆసక్తికరంగా మారింది.
కాగా, ఆ భవనాల డిజైన్లు, ఇతర వివరాలతో పూర్తిస్థాయి నివేదిక పంపితే వాటిని పరిశీలించి, రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రాజ్భవన్, అసెంబ్లీతోపాటు మరో ఒకటి రెండు భవనాలు ఉండే అవకాశముంది.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, రాష్ట్ర రాజధాని నగర నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం విజయవాడలో సమీక్షించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల క్వార్టర్లు, ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయ సముదాయాల నిర్మాణంపై శుక్రవారం నాటి భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కాగా, సింగపూర్ ప్రభుత్వం కూడా రాజధాని నగర నిర్మాణంలో తాము భాగస్వాములం వుతామంటూ ఏపీ సర్కార్ను కోరుతోంది. దీంతో రాజధానిలో ప్రధానంగా చేపట్టాల్సిన పనులపై శుక్రవారం ఒక నిర్ణయం తీసుకోవాలని సీఆర్డీఏ భావిస్తోంది. సీఆర్డీఏ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మంత్రి నారాయణ గురువారం సంస్థ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సిద్ధం చేశారు. వివిధ దేశాల్లోని పేరొందిన రాజధానులు, ఈ మధ్యకాలంలో నిర్మితమైన క్యాపిటల్స్, నదీ తీరాల్లో వెలసిన అధునాతన రాజధానులపై అధ్యయనం చేసి గుర్తించిన విషయాలు, అమరావతి మాస్టర్ప్లాన్లపై ఇటీవల మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించిన వర్క్షాపులో అందిన సలహాలు, సూచనలను క్రోడీకరిస్తూ ఈ ప్రెజంటేషన్ రూపొందించారు.