పెళ్ళికి 50 మందికి అనుమతి ఇచ్చిన కేంద్రం .. కానీ షరతులు వర్తిస్తాయి
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజల జీవన విధానం మారిపోయింది. ప్రజల ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయి . ప్రజలు వివాహ కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిదని అధికారులు చేసిన సూచనలతో పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్న వాళ్ళు ప్రభుత్వ సడలింపుల కోసం ఆశగా ఎదురు చూశారు . పెళ్లి వంటి శుభ కార్యాల కోసం వేచి చూస్తున్న వారికి ఇక కేంద్రం కాస్త ఉపశమనం కలిగే వార్త చెప్పింది . నిన్నా మొన్నటి దాకా పెళ్లికి కేవలం 10 మంది మాత్రమే ఉండాలని రెవెన్యూ, పోలీస్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తారని, ఇక ఆ అనుమతి మేరకే గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పారు.
లాక్ డౌన్ ఆంక్షలతో బెంబేలు: పెళ్ళిళ్ళను నమ్ముకుని జీవనం సాగించే వారి బతుకు కుదేలు
కేంద్ర తాజా మార్గదర్శకాలు కాబోయే వధూ వరులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి . లాక్ డౌన్ ని మరో రెండు వారాల పాటు పొడిగిస్తూనే కొన్ని సడలింపులను ఇచ్చింది కేంద్ర సర్కార్ . కేంద్రం రెండో దఫా విధించిన లాక్ డౌన్ పీరియడ్ ముగుస్తుండటంతో మరో 15 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే సమయంలో కేంద్రం కొన్ని సడలింపులు చేస్తూ చేసిన ప్రకటన కొన్ని వర్గాలకు కాస్త రిలాక్స్ గా అనిపించింది . జిల్లాలను కేసుల సంఖ్యను బట్టి రెడ్,ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా విడగొట్టిన కేంద్రం గ్రీన్ జోన్లలో వ్యాపారాలకు మరిన్ని అనుమతులు ఇచ్చింది. ఆంక్షలు బాగా తగ్గించింది .ఇక పెళ్ళిళ్ళ విషయంలోనూ సడలింపు ఇచ్చింది కేంద్ర సర్కార్ .
లాక్ డౌన్ కాలం లో ఎంతో మంది పెళ్లిళ్లు వాయిదా పడ్డ నేపధ్యంలో కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రీన్ జోన్స్ లో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని పేర్కొంది. తాజా మార్గదర్శకాలలో కేంద్ర హోమ్ శాఖ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 50 మంది వరకు పెళ్ళికి హాజరు కావచ్చని తెలిపింది. అయితే పెళ్ళికి హాజరయ్యే వారంతా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటించాలని , షేక్ హ్యాండ్స్ , ఆప్యాయంగా కౌగిలించుకోవటాలు చెయ్యరాదని పేర్కొంది. అంతే కాకుండా పెళ్ళికి వచ్చిన వారంతా భౌతికదూరం పాటించాలని సూచించింది.