స్టీల్ ప్లాంట్పై గేరుమార్చిన వైసీపీ- పార్లమెంటులో ఎంపీల వాకౌట్- ఇదే తొలిసారి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం పార్లమెంటులో రోజుకో కలకలం రేపుతోంది. ఏపీలో నిరసనల దృష్ట్యా రాష్ట్రానికి చెందిన ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్రం రోజుకో క్లారిటీ ఇస్తోంది. దీంతో కేంద్రం వైఖరిపై ఏపీకి చెందిన ఎంపీలు మండిపడుతున్నారు. ఇవాళ కూడా దాదాపు ఇవే దృశ్యాలు కనిపించాయి. స్టీల్ ప్లాంట్ మిగులు భూములపై కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇవ్వగా, ఆ తర్వాత రాజ్యసభలో ఉక్కుమంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో మండిపడిన వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ ఎంపీలు వాకౌట్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
స్టీల్ ప్లాంట్పై కేంద్రం వరుస షాకులు
విశాఖ స్టీల్ ప్లాంట్ను వంధశాతం ప్రైవేటీకరిస్తామని ఇప్పటికే పార్లమెంటులో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మన ఎంపీలు
అడుగుతున్న ప్రశ్నలకూ అంతే నిష్కర్షగా సమాధానాలు ఇస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ ఎంపీలు పార్లెమెంటు దృష్టికి తెస్తున్నా అవేవీ పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. ఇవాళ కూడా లోక్సభ, రాజ్యసభలో ఇవే దృశ్యాలు కనిపించాయి. దీంతో విసుగెత్తిన ఏపీ ఎంపీలు తమ నిరసన తెలిపి బయటికొచ్చారు.
స్టీల్ ప్లాంట్ మిగులు భూములపై స్పష్టత
వైజాగ్ స్టీల్ప్లాంట్కు చెందిన 7 వేల ఎకరాల మిగులు భూముల వ్యవహారంపై ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. లోక్సభలో వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మిగులు భూముల విషయంపై అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. అవసరమైన మేరకు స్టీల్ప్లాంట్ భూములను ప్రైవేట్పరం చేస్తామన్నారు. మిగతా వాటిని ఏం చేయాలో తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రుల కమిటీవేస్తామని స్పష్టం చేశారు.
రాజ్యసభలో ఎదురు తిరిగిన వైసీపీ
రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా భాసిల్లుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ సమర్ధించబోదన్నారు.
నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనానికిక అవసరమైన ప్రణాళిక, చర్యలను రూపొందించడానికి బదులుగా వాటిని ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ హక్కులు కట్టబెట్టడం తప్పు లేదు. కానీ ముందుగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు సంపూర్ణంగా జరిగిన తర్వాత మాత్రమే మిగిలిన గనులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని ఆయన సూచించారు.
కేంద్రం తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్
ఇప్పటి వరకు అమలులో ఉన్న టన్ను ఖనిజానికి ఇంత మొత్తం రాయల్టీ మైనింగ్ లీజుదారుడు చెల్లించే నిబంధన స్థానంలో మైనింగ్ ఆదాయంలో ప్రభుత్వం వాటా పొందేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీని వలన 50 మైనింగ్ బ్లాక్లు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళతాయి. ఈ బ్లాక్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. అయితే పవర్ ప్లాంట్ల నుంచి రావల్సిన 17 వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టలేక కోల్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తీవ్రమైన ఆర్థిక వత్తిళ్ళను ఎదుర్కొంటోంది. పవర్ ప్లాంట్ల నుంచి బకాయిలను రాబట్టి కోల్ ఇండియాను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. తద్వారా ఆ సంస్థలో పని చేస్తున్న వేలాది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు దన్ను చేకూర్చేలా ఉన్న ఈ బిల్లును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు.