రూ.680 కోట్లు తక్షణం కరవు సాయం అందించండి:సిఎం చంద్రబాబు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లోని కడప,నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాలలో కరువు నుంచి ఉపశమన చర్యల నిమిత్తం తక్షణమే రాష్ట్రానికిరూ. 680 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికి ప్రకృతి సహకరించకుంటే నష్టపోక తప్పదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందానికి వివరించారు.
రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు చేపట్టడానికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చేస్తున్నకృషికి అదనంగా ఈ సాయం అందించాలని సిఎం కోరారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై పరిశీలన కోసం ఎపికి విచ్చేసిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు నాలుగు జిల్లాలో పర్యటించింది. అనంతరం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది.
తాము రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని 121 మండలాల్లో పర్యటించామని వాటిలో ప్రకాశం జిల్లాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నట్లుగా కేంద్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, తాగునీటి, పశుగ్రాస సమస్యలు కూడా అధికంగా ఉన్న విషయాన్ని తాము గమనించామని వారు సిఎంకు వివరించినట్లు తెలిసింది.
అయితే రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేంద్ర బృందం ఈ సందర్భంగా సిఎం చంద్రబాబును మెచ్చుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పెన్షన్లు, రేషన్ అందించేందుకు అవలంబిస్తున్నవిధానాలు తమనెంతో ఆకట్టుకున్నాయని, అలాగే కరువు మండలాల్లో ఉపాధి హామీ పధకం పనులు జరుగుతున్న తీరు చాలా అభినందనీయమని బృందం ముఖ్యమంత్రితో వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండి శేషగిరి బాబు తదిదరులు పాల్గొన్నారు.