విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ : ఏపీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ .. వరుస షాకులిస్తున్న కేంద్రం !!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు పార్లమెంటులో సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు 100% ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెబుతూనే, కోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లకు హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రానికి ఉన్న పూర్తి అధికారాలను స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని, కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం : సీఎం జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కార్మికుల అల్టిమేటం !!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం అఫిడవిట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు కేంద్రానికి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు లో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయమని స్పష్టం
కేంద్రం తరఫున కార్యదర్శి ఆర్కె సింగ్ ఈ మేరకు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన పూర్తి స్థాయిలో పెట్టుబడులు ఉపసంహరించాలని క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నిర్ణయం తీసుకునే అధికారం ఉందని, ఇటువంటి విషయాలలో కోర్టులు జోక్యం చేసుకోలేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
కోర్టులు జోక్యం చేసుకోలేవని, ఆ పిటీషన్లు కొట్టేయాలని కేంద్రం విజ్ఞప్తి
ఇలాంటి వాటిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ఉదహరించారు. కేంద్ర క్యాబినెట్ కమిటీలో ప్రధాని, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, ఉక్కు మంత్రి, పెట్రోలియం మంత్రి సభ్యులుగా ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అర్హత కలిగిన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్ లను కొట్టివేయాలని కేంద్రం తన కౌంటర్ దాఖలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తేల్చిచెప్పింది.
కేంద్రం మనసు మారటం కష్టమే ... అఫిడవిట్ చెప్పిందిదే
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కినా సరే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోబోదని తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా మరోమారు స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మనసు మార్చుకోవటం అసంభవం అన్న సంకేతాలు తాజాగా కేంద్రం వేస్తున్న అడుగులతో స్పష్టంగా అర్ధం అవుతుంది.