ఉక్కు ఫ్యాక్టరీ పై ఏపి ప్రభుత్వం స్పందించ లేదు : కేంద్రాన్ని అభ్యర్ధించినా వినలేదు..
ఏపిలో స్టీల్ ఫ్యాక్టరీ ని కడప జిల్లాలో ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. కేంద్రం నిర్మించాల్సిన స్టీల్ ఫ్యాక్టరీ తాము నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. దీని పై కేంద్రం ఓ ప్రకటన చేసింది. కడప లో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని సెయిల్ నివేదిక ఇచ్చిందని తేల్చి చెప్పింది. టాస్క్ఫోర్స్ నుండి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఏపి ప్రభుత్వం సహకరించలేదు..
ఏపి పునర్విభజన చట్టం ప్రకారం ఏపి లో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కు కేంద్రం నాడు సమ్మతించింది. అయితే ,ఇదే అంశం పై అనేక సార్లు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంతనాలు సాగాయి. తాము ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవటం లేదని..దీంతో..తామే రంగంలోకి దిగి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసామని ముఖ్యమం త్రి ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రం ఓ ప్రకటన చేసింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యంకాదని సెయిల్ నివేదిక ఇచ్చిందని కేంద్రం తేల్చి చెప్పింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత.. ముడి ఇనుము, నిల్వల వివరాలను ఏపీ ప్రభుత్వం అందించలేదని పేర్కొంది. కడపలో స్టీల్ ప్లాంట్పై ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, టాస్క్ఫోర్స్ ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 17న టాస్క్ఫోర్స్ సమావేశం జరిగిందని, టాస్క్ఫోర్స్ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి కడప లో శంకుస్థాపన చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది.
కేంద్రం వివక్ష చూపింది... అందుకే మేమే..
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇదే అంశం పై కేంద్రం మీద ఫైర్ అయ్యారు. తాము కడపలో స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయని చెప్పామన్నారు. అలాగే అన్ని వనరులు కల్పిస్తామని కంపెనీ పెట్టాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. ఒకటి కాదు..రెండు కాదు 11 సార్లు సందేహాలు వ్యక్తం చేశారని చెప్పారు. ప్రధానిని కలిసి కోరానని.. కేంద్రమంత్రికి లేఖలు రాశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కడప లో స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని చెప్పినా వినలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని..
పన్ను మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేసామన్నారు. కేంద్రానికి 60 రోజుల డెడ్లైన్ పెట్టి.. కంపెనీకి శంకుస్థాపన చేశామని వివరించారు.. తొలి విడతలో రూ.18 వేల కోట్లు..రెండో విడతలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఫ్యాక్టరీతో లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు వివరించారు. అయితే, కేవలం ఎన్నికల ముందు రాజకీయం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ శంకుస్థాపన చేస్తోందని.. ఇందులో ప్రభుత్వం చిత్తశుద్ది లేదని వైసిపి విమర్శిస్తోంది.