మీరేమీ సూపర్ సిటిజన్స్ కాదు: ఎంపీల డిమాండ్పై మంత్రి అశోక్ గజపతిరాజు
అమరావతి: ఎంపీలపై టీడీపీ సీనియర్ నేత, కేంద్రం పౌరయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్కు ఎన్నికకాగానే ఎంపీల హోదాలో రాజకీయ నేతలు చూపే డాబూ దర్పాన్ని ఆయన ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు పొందడానికి పార్లమెంటు సభ్యులు సూపర్ సిటిజన్స్ కాదని గురువారం లోక్సభలో విమానయానశాఖ మంత్రి అశోక్గజపతి రాజు పేర్కొన్నారు. గురువారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా విమానాశ్రయాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
విమానాశ్రయాల్లో ఎంపీలకు ప్రత్యేక సౌకర్యాల కల్పన, విమానాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రైవేటు ఎయిర్లైన్స్లో సదుపాయాలు కోరుతూ గుర్తింపుకార్డులు చూపినప్పటికీ సిబ్బంది తమను గుర్తుపట్టడం లేదని ఎంపీలు వాపోయారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ ''విమానాశ్రయాల్లో ఎంపీలను ప్రత్యేకంగా చూడటం కుదరదు. ఎంపీలు సూపర్ సిటిజన్సేమీ కాదు. కాబట్టి వారికి సాధారణ పౌరులకు మించి సౌకర్యాలు కల్పించడం కుదరదు. సీట్ల అందుబాటు, ప్రాధాన్యాన్ని బట్టి వాటి కేటాయింపులు ఉంటాయి. అంతేగాని ఎంపీలైనంత మాత్రాన ప్రత్యేకంగా పరిగణించే అవకాశం లేదు. రోగులు, వృద్ధుల విషయంలో మానవత్వంతోనే వ్యవహరిస్తాం. సీట్ల కేటాయింపులో వాణిజ్య కోణమే ఎక్కువగా ఉంటుంది'' అని ఆయన చెప్పారు.
వాస్తవానికి ఎంపీలు మంత్రులుగా ఉన్నప్పుడు వారి విమానయానం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు తమ శాఖ అన్ని చర్యలను తీసుకుంటుందని అన్నారు. మరోవైపు ఎంపీలు గుర్తింపు కార్డు చూపినప్పుడు అందుబాటులో ఉన్న ఎగువ తరగతి సీట్లను కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి సూచించారు. అయితే విమానాశ్రయ అధికారులు మాత్రం ఈ సౌకర్యాన్ని సులభంగా పొందగలుగుతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications