మీలా కావాలంటే ఏం చేయాలి?: బెజవాడ పర్యటనలో స్మృతి ఊహించని ప్రశ్న
విజయవాడ: భారతదేశ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఎంతగా కృషి చేస్తున్నారో, అంతే సమానంగా ఏపీని అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పొగడ్తలతో ముంచెత్తారు. మంగళవారం ఉదయం విజయవాడకు వచ్చిన ఆమె పాతబస్తీలోని గుజరాతీ విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో ముచ్చటించారు.
ముందుగా గుజరాతీ విద్యాలయంలో నూతన ల్యాబ్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె కాసేపు విద్యార్థినులతో ముచ్చటించి, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ ముచ్చటలో భాగంగా స్మృతి ఇరానీని ఓ విద్యార్థిని ప్రశంసలతో ముంచెత్తింది. 'మీరు చాలా డైనమిక్, నేనూ మీలా ఓ డైనమిక్ మహిళను కావాలనుకుంటున్నాను. నాకు మీరే స్ఫూర్తి.. మీలా ఎదగాలంటే ఏం చెయ్యాలి..?' అని అడిగింది.
ఈ ప్రశ్నకు స్మృతి సమాధానమిస్తూ 'విద్యార్థినులు బయటి వారిని కాకుండా ఇంట్లో వారిని, తమ చుట్టూ ఉన్నవారినే స్ఫూర్తిగా తీసుకోవాలి' అని అన్నారు. తన కుటుంబంలోని వ్యక్తులను, టీచర్ల నుంచి ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.

ఆనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వివరించారు.
ఉన్నతవిద్యలో విద్యార్థినులు బాగా రాణించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా బాలికల విద్య పట్ల కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించామని మంత్రి స్మృతీ ఇరానీ వివరించారు. గుజరాతీ విద్యాలయం తరపున చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఆమె అభినందించారు. ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వాలతో కలిసి పనిచేయటం శుభపరిణామంగా పేర్కొన్నారు.
ఉదాన్ కార్యక్రమంతో విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తున్నామని చెప్పిన మంత్రి, ఉదాన్లో గుజరాతీ విద్యాలయాన్ని చేరుస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. స్మృతి పర్యనటలో భాగంగా రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications