ఏపీలో టిడిపి-బిజెపి వెరైటీ రాజకీయం...విషయం ఏంటంటే?
కర్నూలు:ఎపిలో టిడిపి-బిజెపి విచిత్రమైన రాజకీయం చేస్తున్నాయి...మిత్ర పక్షాలే కాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్య పార్టీలు అయిన ఈ రెండు పార్టీలు...ప్రస్తుతం ఎపికి సంబంధించి ఎలా తయారయ్యాయంటే తమలపాకుతో నువ్వొకటిస్తే...తలుపు చెక్కతో నేను రెండిస్తా...అన్న చందంగా తయారయ్యాయి. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నబీజేపీని తమ హామీలు నెరవేర్చాలని టిడిపి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాయలసీమ బిజెపి నేతలు తాజాగా టిడిపికి వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కర్నూలులో జరిగిన రాయలసీమ బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీ బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో పలు తీర్మానాలు చేయడంతో పాటు తమ డిమాండ్ల నెరవేర్చుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సిద్దమని ప్రకటించడం రాయలసీమ ఉద్యమానికి మరింత ఊపునిచ్చే అవకాశం కనిపిస్తోంది.
కర్నూలులో జరిగిన రాయలసీమ బీజేపీ నేతల సమావేశం సందర్భంగా రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ బీజేపీ నేతలు ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గవర్నర్ తాత్కాలిక విడిది, సీఎం నివాసం, అసెంబ్లీ భవనం కూడా ఏర్పాటు కూడా రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి రాయలసీమలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అలాగే రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించాలని, చేతి వృత్తిదారులకు 5 వేల రూపాయల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈ సమావేశం సందర్భంగా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇప్పటికే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమ లాయర్లు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు గుంటూరులోని ఏఎన్యూలోని భవనాలను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల బృందం ఇటీవల పరిశీలించింది. అయితే నేలపాడు లోని సిటీ సివిల్ కోర్టు ఆవరణంలోనే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు న్యాయమూర్తుల ఫుల్ కోర్టు ఆమోదం తెలిపినట్లు వార్తలు వెల్లడవుతున్న నేపథ్యంలో బిజెపి నేతల తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. ఏదేమైనా రాయలసీమలో హై కోర్టు కోసం న్యాయవాదులు గట్టిగా పోరాడుతున్ననేపథ్యంలోనే బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో పలు డిమాండ్లతో తెరమీదకు రావడం రాయలసీమ ఉద్యమానికి ఊపునిచ్చేలా కనిపిస్తోంది.