రాయలసీమ ఎత్తిపోతలపై జగన్ సర్కార్కు కేంద్రం గుడ్న్యూస్: నెగ్గిన వాదన: ఇంకొక్క అనుమతి
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతలపై పథకం నిర్మాణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీని నిర్మాణానికి తమ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదివరకే అన్ని రకాల అనుమతులను పొందిన పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామంటూ ప్రభుత్వం వినిపిస్తూ వస్తోన్న వాదనలతో ఏకీభవించింది. అదనంగా ఎలాంటి సాకేంతిక పరమైన అనుమతులను మంజూరు చేయాల్సిన అవసరం లేదని తాము గుర్తించినట్లు పేర్కొంది.
కేంద్ర జలసంఘం తాజాగా వెల్లడించిన తన అభిప్రాయంతో ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రారంభ పనులను ముగించుకుంది. కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి బిడ్డింగుల ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. ఈ పథకం నిర్మాణానికి ఇదివరకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఇచ్చాయి. తాజాగా- సీడబ్ల్యూసీ కూడా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇక కృష్ణా బోర్డు అనుమతిని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అదొక్కటే మిగిలి ఉంది.
కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలతో పాటు నెల్లూరు జిల్లాకు సాగు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడానికి ప్రణాళికలను రూపొందించుకుంది. దీనికి మొదటి నుంచీ అడ్డంకులు ఎదురయ్యాయి. తెలంగాణ-ఏపీ మధ్య అంతరాష్ట్ర వివాదంగా మారింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర జలసంఘం, జల్శక్తి మంత్రిత్వ శాఖ వద్ద తమ వాదనలను వినిపించాయి.
ఇప్పటికే అన్ని రకాల అనుమతులను తీసుకున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా దీన్ని చేపట్టబోతోన్నట్లు ఏపీ ప్రభుత్వం వాదించింది. కొత్తగా తాము కృష్ణా జలాలపై ఎలాంటి ప్రాజెక్టును నిర్మించట్లేదని పేర్కొంది. వరద జలాలను మళ్లించడానికి పోతిరెడ్డి పాడును ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిందని, దీన్ని మరింత విస్తరించాలనేదే తమ ప్రణాళికగా చెప్పుకొచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదంటు సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని వెల్లడించడంతో.. మరో అడ్డంకి తొలగిపోయినట్టయింది.