జగన్ సర్కారుకు కేంద్రం గుడ్ న్యూస్-ప్రైవేటీకరణ వేళ భారీ ఊరట-త్వరలో ఎంపిక
అసలే ప్రైవేటీకరణకు కేంద్రం ఉరుకులు పరుగులు పెడుతున్న వేళ. కొత్తగా ప్రభుత్వ రంగ సంస్ధల సంగతి దేవుడెరుగు ఉన్న వాటినే అమ్ముకోవాల్సిన పరిస్ధితి. నష్టాలతో ఎంతోకాలం వీటిని భరించలేమని చేతులెత్తేస్తున్న పరిస్ధితి. ఇలాంటి తరుణంలో ఓ కొత్త సంస్ధనో, మౌలిక సదుపాయాన్నో కల్పించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకుంటున్న తరుణం. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రం గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతున్న ఆ హామీ నెరవేరితే రాష్ట్రానికి భారీగా మేలు జరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

జగన్ సర్కారుకు కేంద్రం గుడ్ న్యూస్
ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ పోర్టు ప్రైవేటీకరణ సంకేతాలతో వరుస షాకులు ఇచ్చిన కేంద్రం... మరో అంశంలో మాత్రం రాష్ట్రానికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర విభజన సందర్భఁగా ఇచ్చిన ఓ హా్మీని నిలబెట్టుకునేందుకు ముందుకొచ్చింది. జగన్ ప్రభుత్వం వరుస ప్రయత్నాలు, డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఓ మేజర్ పోర్టు నిర్మాణానికి సాయం చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కేంద్రంతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ మేరకు హామీ లభించింది. దీంతో ప్రైవేటీకరణ వేళ వైసీపీ ప్రభుత్వానికి ఇదో ఊరటగా కనిపిస్తోంది.

భావనపాడు లేదా రామాయపట్నానికి సాయం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణ ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాగే విభజన హామీల్లో భాగంగా ప్రకాశం జిల్లా రామాయపట్నం లేదా నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ఓ పోర్టు నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటిలో ఏదీ ఇప్పటివరకూ అమలు కాలేదు. అయితే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి అవకాశాలు లేవని గతంలోనే తేల్చేశారు. ఇక మిగిలింది రామాయపట్నం లేదా భావనపాడు. ఈ రెండిట్లో ఒక చోట పోర్టు నిర్మాణానికి ఆర్ధిక సాయం చేస్తామని కేంద్రం తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో ఈ రెండిట్లో అనుకూలతల ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

రెండు నెలల్లో కొత్త పోర్టు ఖరారు
తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. కేంద్ర పోర్టుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. ఇందులో మాండవీయ ఏపీలో రెండింటిలో ఒక పోర్టును ఎంపిక చేసి దానికి ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో ఏపీలో పర్యటించి రెండు పోర్టుల్లో ఒక దానిని ఎంపిక చేద్దామని సూచించారు. సాంకేతిక అంశాలతో పాటు ఇతర అంశాల్నీ దృష్టిలో ఉంచుకని పోర్టు నిర్మాణ స్ధలం ఎంపిక ఉంటుంది. దీంతో భావనపాడు లేదా రామాయపట్నంలో ఒక చోట పోర్టు నిర్మాణం ఖాయమైంది. కేంద్ర మంత్రి పర్యటన తర్వాత కొత్త పోర్టు ఖరారు ప్రకటన రావాల్సి ఉంది. ఆ తర్వాత పనులు మొదలుకావడం లాంఛనమే.

ప్రైవేటీకరణ వేళ భారీ ఊరట
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల్ని వదిలించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అదే సమయంలో కొత్తగా ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం లేదు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ప్రతిపాదనలు ఫైళ్ల రూపంలో మూలుగుతున్నాయి. అయినా వీటిపై కేంద్రం నోరు మెదపడం లేదు. నిధుల లభ్యత తగ్గిపోవడంతో పాటు నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ సంస్ధలు, మౌలిక సదుపాయాల వైపు కేంద్రం కన్నెత్తి చూడటం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో కొత్తగా ఓ పోర్టు నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం చేస్తామని ముందుకురావడం శుభసూచికంగా అనుకోవచ్చు. విభజన హామీల్ని నెరవేర్చాలన్న ఉద్దేశం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం లాబీయింగ్ మేరకు కేంద్రం పోర్టు నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వబోతుండటం భారీ ఊరటగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications