రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాజకీయంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అటు మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన క్రమేణా పోరాటం తీవ్ర తరం చేస్తున్నారు. ప్రజా నిరసనలకు సిద్దం అయ్యారు. ఇటు జనసేనాని పవన్ సైతం రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరికల పైన ఫోకస్ చేసారు. ఇందు కోసం తాజాగా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ రాజకీయంగా రూటు మార్చారు. పార్టీ బలోపేతం పైన ప్రత్యేకం గా ఫోకస్ చేసారు. క్షేత్ర స్థాయి నుంచి బలం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇందు కోసం పార్టీ లో కొత్త కమిటీల పైన కసరత్తు చేస్తున్నారు. విమర్శలు వస్తున్న కారణంగా నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల పార్టీ కమిటీలను మొత్తంగా రద్దు చేసారు. పార్టీ నేరుగా ఈ రెండు జిల్లాల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు పవన్ సిద్దం అవుతున్నారు. ఇదే సమయం లో తెలంగాణ పైనా కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా.. ఏపీలో జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజిక వేత్తలు, తటస్థులను చేర్చుకునేందుకు కొత్త కార్యాచరణ ఖరారు చేసారు. వారిని సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. 14 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేశ్లకు చోటు కల్పించారు.
పార్టీ బలోపేతం పై పవన్ ఫోకస్
వీరితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెద్దపూడి విజయకుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి... పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఏపీ తరహాలో తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
అయితే జనసేన అధినాయకత్వం నియమించిన కమిటీలపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ దాదాపు 10-15 ప్రత్యేక కమిటీలను నియమించింది. అయితే ఈ కమిటీల పేర్లు మారుతున్నాయి... తప్ప అందులో సభ్యులు మాత్రం మారడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి జాయినింగ్స్ కమిటీలో మరింత మందికి స్థానం కల్పించాలని నాయకులు ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications