2024 కల్లా పోలవరం పూర్తి కావడం కష్టమే-రాజ్యసభలో తేల్చేసిన కేంద్రం...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన పోలవరం ప్రాజెక్టు వైసీపీ సర్కార్ హయాం వచ్చేసరికి నత్త నడకన సాగుతోంది. అప్పట్లో కాస్తో కూస్తో నిధులిచ్చిన కేంద్రం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం నిధులిచ్చి పూర్తి చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో దీనిపై కేంద్రం తేల్చేసింది.
2024 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని గతంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ గడువు కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం కష్టమని కేంద్రం తేల్చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం ఇచ్చారు. దీంతో పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ సర్కార్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రంతో వైసీపీ సర్కార్ నెరుపుతున్న సంబంధాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు తప్పనిసరిగా సాయం చేస్తుందని ఆశించారు. అయితే కేంద్రం ఇవేవీ లెక్కచేయడం లేదని తేలిపోయింది.
పోలవరం ప్రాజెక్టుకు పెడుతున్న ఖర్చు, నిర్మాణంలో జాప్యంపై వైసీపీ ఎంపీ పిల్లిసుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించిన కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు.. 2024 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే వివిధ కారణాలతో ప్రాజెక్టు ఆ గడువు నాటికి పూర్తి కావడం కష్టమని తేల్చిచెప్పేశారు. అయితే ఆ కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో కేంద్రానికి దీనిపై చిత్తశుద్ధి లేదని అర్ధమవుతోంది.