Polavaram: పోలవరంపై కేంద్రం మరో షాక్ ! కట్టాల్సింది మీరే..!
ఏపీలో విభజన హామీల్లో కీలకమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్రం మరో విషయం తేల్చిచెప్పేసింది. విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుకు ప్రకటించి తామే మొత్తం ఖర్చు భరించి పూర్తి చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసేసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి ఇప్పటికే పలు కొర్రీలు పెడుతున్న కేంద్రం.. ఇప్పుడు దాని చెల్లింపు విషయంలోనూ పార్లమెంటులో క్లారిటీ ఇచ్చేసింది.
పోలవరం జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినా దాన్ని ప్రత్యక్షంగా నిర్మించాల్సింది మాత్రం ఏపీ ప్రభుత్వమే అని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రానికి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ పోలవరం ప్రాజెక్టును విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా 2020 నుంచి పనులు ఎందుకు జరగడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి షెకావత్ కీలక జవాబు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులతో ఖర్చుచేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే రీయింబర్స్ మెంట్ చేస్తామని జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చిచెప్పేశారు. అంటే రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చేసినట్లయింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉంటేనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందే తప్ప కేంద్రం తమ నిధులు ముందుగా ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చిచెప్పినట్లయింది. 2020 నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదన్న ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి.. 2020-21లో రూ.2234 కోట్లు, 2021-22లో రూ.711 కోట్లు, 2022-23లో రూ.1671 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications