Nagarjuna Sagar: కేంద్రం చేతుల్లోకి వెళ్లిన నాగార్జున సాగర్ డ్యామ్-ఏపీ, తెలంగాణ టెన్షన్ల మధ్య..
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానదిపై ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ ను కేంద్రం తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ లో ఈ ప్రతిపాదన చేశారు. దీనికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం దీన్ని స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ అధికారులు పోలీసుల సాయంతో డ్యామ్ లో తమ భూభాగంలో ఉన్న 13 గేట్లను స్వాధీనం చేసుకుని అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. తెలంగాణ పోలీసుల అభ్యంతరాలు చెబుతున్నా పట్టించుకోకుండా ఎన్నికల పోలింగ్ సమయంలో ఏపీ అధికారులు డ్యామ్ లో తమ భాగం నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో మూడు రోజుల క్రితం మొదలైన ఉద్రికతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది.

కేంద్రం ఆదేశాలతో కృష్ణా బోర్డుతో కేంద్ర జలసంఘం కూడా ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడాయి. అయితే అంతకు ముందే ఏపీ దౌర్జన్యంగా నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించి నీటిని విడుదల చేస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు సాగర్ నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
దీంతో నీటి విడుదల ఆపేశారు. అదే సమయంలో మరింత సంఘర్షణను నివారించడానికి, డ్యామ్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇవాళ తమ నియంత్రణలోకి తీసుకుంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరువైపులా నీటి విడుదల జరిగేలా సీఆర్పీఎఫ్ బలగాలు పర్యవేక్షించబోతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్ లో హైబ్రిడ్ మోడ్లో తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల శక్తి శాఖ అధికారులు సమావేశం అవుతారు.












Click it and Unblock the Notifications