హైకోర్టు ప్రతిపాదన ఒప్పుకోని జగన్ ! చేతులెత్తేసిన కేంద్రం-రాజధాని మార్పుపై లింక్ పెట్టారా ?
ఏపీలో గతంలో జడ్డీలు వర్సెస్ జగన్ గా సాగిన రాజకీయం మరోసారి తెరపైకి వస్తోంది. తాజాగా హైకోర్టు చేసిన ఓ కీలక ప్రతిపాదనకు జగన్ తోసిపుచ్చారు. దీంతో ఈ ప్రతిపాదనపై ముందుకెళ్దామని అనుకున్న కేంద్రం కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరికి ఆ ప్రతిపాదన కాస్తా ప్రతిపాదనగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు సాక్షిగానే కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో ఆ ప్రభావం హైకోర్టు తరలింపుపైనా పడినట్లు తెలుస్తోంది.
Recommended Video
జడ్డీలు వర్సెస్ జగన్ పోరు
గతంలో తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులతో సీఎంగా ఉన్న జగన్ విభేదించారు. అంతే కాదు అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రంగా జడ్డీలు తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే అప్పట్లో సీజేఐగా ఉన్న బాబ్డే దీనిపై విచారణ జరిపి ఆరోపణల్ని తోసిపుచ్చారు. దీంతో ఆ పోరు అక్కడితో ముగిసిందని అంతా భావించారు. ఆ తర్వాత జస్టిస్ ఎన్వీరమణ సీజేఐ కావడంతో జగన్ కూడా శాంతించారు.
ఏపీ హైకోర్టు జడ్డీల పెంపు
ఏపీలో హైకోర్టు జడ్జీల్ని ప్రస్తుతం ఉన్న 37కు మించి పెంచాలంటూ హైకోర్టు తాజాగా కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. రోజురోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి నేపథ్యంలో జడ్డీల ఖాళీల భర్తీతో పాటు జడ్డీల సంఖ్య పెంపు కూడా తప్పనిసరని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించి జడ్డీల ఖాళీల్ని భర్తీ చేస్తూ వచ్చింది. అదే సమయంలో హైకోర్టు జడ్డీల సంఖ్య కూడా పెరిగితే సమస్య తీరిపోతుంది హైకోర్టు భావించింది. కానీ చివరి నిమిషంలో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దీంతో ఏపీ హైకోర్టులో జడ్డీల సంఖ్య 37కే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది.
జడ్డీల పెంపు వద్దన్న జగన్
హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు మించి పెంచాలంటూ హైకోర్టు కేంద్రానికి పంపిన ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంగీకరించలేదు. వివిధ కారణాలతో ఆయన కేంద్రాన్ని ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని కోరారు. ఈ విషయాన్ని న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు తాజాగా పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న హైకోర్టు జడ్డీల పెంపు ప్రతిపాదన చేసిందని, అయితే ఏప్రిల్ 29న సీఎం జగన్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమకు లేఖ రాశారని కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో కేంద్రం కూడా ముందుకు వెళ్లలేకపోయిందన్నారు. అయితే హైకోర్టులో ఖాళీగా ఉన్న ఆరు జడ్డీల పోస్టుల భర్తీకి కొలీజియం నుంచి వచ్చిన ప్రతిపాదన తమకు అందినట్లు ఆయన తెలిపారు.
హైకోర్టు తరలింపుకు అందుకే ముడిపెట్టారా ?
జడ్డీల పెంపుకు హైకోర్టు నుంచి వచ్చిన ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన వెనక్కి పోయింది. అదే సమయంలో హైకోర్టు తరలింపు కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంటులో వేస్తున్న ప్రశ్నలకు తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పెండింగ్ లో లేదని కేంద్రం తేల్చిచెప్పేస్తోంది. అంతే కాదు హైకోర్టు సీజేతో ప్రభుత్వం చర్చించుకుని తరలింపుపై ప్రతిపాదన పంపాలంటోంది. తద్వారా హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ పెడుతోంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ తప్పనిసరిగా హైకోర్టు సీజేతో సంప్రదించి మాత్రమే తరలింపు చేపట్టాల్సిన పరిస్దితి. కానీ ఇప్పటికే అమరావతినే రాజధానిగా ప్రకటించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం సవాల్ చేయలేదు. దీంతో హైకోర్టు కూడా తరలింపుపై వెంటనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అసలు ఈ ప్రక్రియ ఇప్పటివరకూ మొదలుకాలేదు కూడా. దీంతో జడ్డీల పెంపుపై జగన్ నిర్ణయం దీనిపై ప్రభావం చూపుతోందా అన్న చర్చ కూడా జరుగుతోంది.