జగన్ నిర్ణయానికి కేంద్రం ఆమోదం-చంద్రబాబు పెగాసస్ రచ్చ వేళ- కీలక ఆదేశాలు
ఏపీలో ఓవైపు టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీపై నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను మాజీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారంటూ మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో రచ్చ కొనసాగుతోంది. అదే సమయంలో గతంలో చంద్రబాబు హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్ల కోసం అప్పటి నిఘా విభాగం అధిపతిగా ఉన్న ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు భారీ ఒప్పందాలు చేసుకున్నారు. క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ 'ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్'నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి.కానీ అవేవీ పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్ను విదేశీ కంపెనీలను లీక్ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. దీనిపై ఆయన వివిధ కోర్టులు, ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తూనే ఉన్నారు. అయితే ఏబీపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర హోంశాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏబీపై నమోదైన కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఏబీ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మరోవైపు ఏపీలో చంద్రబాబు ప్రత్యర్ధులపై నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏబీపై సస్పెన్షన్ కు కేంద్రం ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.