పోలవరానికి షాకులే షాకులు- ఇక వచ్చేది 7053 కోట్లే- బకాయి 1650 కోట్లూ డౌటే
ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు వరుస పర్యటనలతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నా ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలపై కానీ, ప్రాజెక్టు తాజా అంచనాల ఆమోదంపై కానీ శ్రద్ధ చూపడం లేదు. దీంతో ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంటుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వంపై అంతకంతకూ ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా ఈ ఆర్ధిక సంవత్సరం వారం రోజుల్లో ముగిసిపోతున్నా రావాల్సిన రూ.1650 కోట్లను సైతం ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

పోలవరంపై అంతులేని నిర్లక్ష్యం
ఎప్పుడో ఏడేళ్ల క్రితం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధుల విడుదలలో కేంద్రం చూపుతున్న అలసత్వం ప్రభావం నిర్మాణంపై తీవ్రంగా పడుతోంది. సకాలంలో నిధులు విడుదల చేయకుండా సాంకేతిక కారణాలను, పాలనా ఇబ్బందులను సాకుగా చూపుతున్న కేంద్రం.. చివరికి ఈ ఆలస్యానికి కారణం తామే అన్న విషయాన్ని సైతం మర్చిపోయి పెరిగిన ప్రాజెక్టు అంచనాలను సైతం ఆమోదించేందుకు నిరాకరిస్తోంది. ఓసారి అంచనాలు ఆమోదించినట్లు కేంద్రంలో ఓ విభాగం ప్రకటిస్తే, మరుసటి రోజు అబ్బే అదేం లేదంటూ మరో విభాగం చేస్తున్న ప్రకటనలే ఇందుకు తార్కాణం.

వారం రోజుల్లో రూ.1650 కోట్లు వస్తాయా ?
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇప్పటివరకూ తిరిగి చెల్లించిన మొత్తం తీసేస్తే ఇంకా రూ.1650 కోట్ల బాకీ మిగిలి ఉంది. దాన్ని ఎప్పుడిస్తారో తెలియని పరిస్ధితి. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసిపోవడానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఆ లోగా ఇవ్వకపోతే ఆ నిధులు ఇక రానట్లే భావించవచ్చు. కేంద్రంలో పలు విభాగాల వద్ద చక్కర్లు కొడుతున్న ఈ బిల్లులకు వారం రోజుల్లో మోక్షం లభిస్తుందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో పోలవరంపై కేంద్రం వద్ద ఏపీ సర్కార్ చేస్తున్న లాబీయింగ్ ఏమాత్రం ఫలించడం లేదని అర్ధమవుతోంది.

ఇక ఇవ్వాల్సింది రూ.7053 కోట్లేనా ?
పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలలో కేంద్రం చేస్తున్న ఆలస్యంతో ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతోంది. ఇలా పెరిగిన ఖర్చుకు కారణం తిరిగి ఏపీ ప్రభుత్వమే అన్నట్లు లెక్క చూపుతోంది కేంద్రం. చివరికి ప్రాజెక్టుకు 2013-14లో రూపొందించిన అంచనా ప్రకారం మొత్తం ఇవ్వాల్సింది రూ.20398 కోట్లేనని కేంద్ర జల్శక్తి శాఖ తాజాగా పార్లమెంటులో మరో భారీ షాకిచ్చింది. తాజా అంచనాల విలువ రూ.50 వేల కోట్ల పైచిలుకు ఉండగా.. దాన్ని కాదని అందులో సగం కూడా లేని పాత అంచనాకే కట్టుబడతామని ప్రకటించడం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్ష అర్ధమవుతోంది. పాత అంచనాల ప్రకారం చూస్తే ఇక ఏపీకి ఇవ్వాల్సింది రూ.7053 కోట్లేనంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలు ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. అయినా నోరెత్తలేని పరిస్ధితి.

దేశంలోనే అత్యధిక నిధులు పోలవరానికేనట
ఓవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న నిధులకు లెక్కలు చెప్తున్నా వాటికి ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తున్న కేంద్రం.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక నిధులు పొందుతున్న జాతీయ ప్రాజెక్టు పోలవరమే అంటోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోతోంది. నిన్న రాజ్యసభలో జల్శక్తి శాఖ సహాయమంత్రి రతన్లాల్ కటారియా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని జాతీయ ప్రాజెక్టులకు విడుదల చేసిన నిధుల్లో 62 శాతం పోలవరానికే ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పోలవరానికి ఇప్పటివరకూ రూ.10 వేల కోట్లకు పైగా నిధులిచ్చినట్లు కటారియా వెల్లడించారు. ఈ లెక్కన చూస్తే మిగతా ప్రాజెక్టులన్నింటికీ కలిపి మరో 3 వేల కోట్లు ఇచ్చినట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications