హైకోర్టు తరలింపు ప్రతిపాదన లేదు-జగన్ కోరుకుంటే మాత్రం కండిషన్స్ అప్లై-కేంద్రం క్లారిటీ
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్.. అందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయించింది. అయితే ఆలోపు హైకోర్టు రాజధాని అమరావతిలోనే ఉండాలని ఇచ్చిన తీర్పుతో దీనికి బ్రేక్ పడింది. అదే సమయంలో కేంద్రం వద్ద గతంలో వైసీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన కూడా మురిగిపోయింది. చివరికి తాజా పరిస్ధితిపై టీడీపీ అడిగిన ప్రశ్నకు పార్లమంటులో ఇవాళ మరోసారి కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
ఏపీ హైకోర్టు తరలింపు
ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ ముందుకెళ్లలేని పరిస్దితి ఉంది. దీంతో గతంలో కేంద్రానికి హైకోర్టు తరలింపుపై ఇచ్చిన ప్రతిపాదనపైనా ఈ మధ్య సీఎం జగన్ ఢిల్లీ పెద్దల వద్ద నోరుమెదపడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు మరోసారి ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపుపై కేంద్రాన్ని క్లారిటీ కోరారు. దీంతో కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
హైకోర్టు మార్చే ప్రతిపాదన లేదన్న కేంద్రం
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం ఇవాళ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్ లో లేదని తేల్చేసింది. గతంలో కేంద్రానికి ఈ మేరకు హైకోర్టు తరలింపుపై సీఎం జగన్ పలు అభ్యర్ధనలు ఇచ్చినా వాటికి కాలాతీతం కావడంతో అవి మురిగిపోయినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం ఇప్పుడు తమ వద్ద ఏపీ హైకోర్టు తరలింపుపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టు తరలించాలని ప్రభుత్వం భావిస్తే అప్పుడు మరో ప్రతిపాదన పంపక తప్పదు.
జగన్ కోర్టులోకి బంతి నెట్టేసిన కేంద్రం ?
2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా హైకోర్టును ఏర్పాటు చేశారని కేంద్రం ఇవాళ పార్లమెంటులో తెలిపింది. 2020 ఫిబ్రవరిలో కర్నూలుకు మార్చాలని సీఎం ప్రతిపాదించారని వెల్లడించింది. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తుందని పేర్కొంది. హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్పుపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. అప్పుడు హైకోర్టు, ప్రభుత్వం కలిపి తమకు ఉమ్మడి ప్రతిపాదన పంపుతాయని వెల్లడించింది. ఆ తర్వాత కేంద్రం ఆమోదిస్తే హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని తెలిపింది.