బీసీ కులగణనకు కేంద్రం నో- సాయిరెడ్డి ప్రశ్నకు జవాబు-ఏపీ అసెంబ్లీ తీర్మానం వృథా
దేశవ్యాప్తంగా బీసీ కులాల జనాభాను లెక్కించాలన్న వైసీపీ డిమాండ్ కు కేంద్రం ఇవాళ మరోసారి నో చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ జనగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానం ఆమోదించి పంపింది. కానీ దీన్ని కేంద్రం తిరస్కరించినట్లయింది.
దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ... స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన జనాభాను మినహా కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు.
కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం షెడ్యూలును రూపొందిస్తుందని మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. బీసీ జనాభా లెక్క తేల్చేందుకు వీలుగా జనాభా లెక్కల్లో కులగణన జరిపించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయం హోం మంత్రిత్వ శాఖకు తెలుసని మంత్రి చెప్పారు. దేశంలో జనాభా సంఖ్యను లేదా ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన జనాభాను లెక్కించడం నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఉద్దేశం కాదని మంత్రి అన్నారు. వర్గీకరణ అవసరాల కోసమే ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే చేపడుతుందని వెల్లడించారు.
బీసీ కులగణన కోసం వైసీపీతో పాటు పలు ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ వంటి పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఈ తేనెతుట్టెను కదిపేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. దీంతో ఈసారి ఎన్ని డిమాండ్లు వినిపిస్తున్నా బీసీ కులగణనపై కేంద్రం మౌనంగా ఉంటోంది. అయినా పార్లమెంటులో పార్టీలు దీనిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాయి.