జగన్ కు కేంద్రం ఇంకో గుడ్ న్యూస్-మరో రూ.581.70 కోట్లు - ఎందుకో తెలుసా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నప్పటికీ అనుకున్న స్ధాయిలో నిధుల్ని తెచ్చుకోలేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో బహిరంగ మార్కెట్లో తీసుకుంటున్న అప్పులపైనా కేంద్రం నుంచి కొర్రీలు తప్పడం లేదు. దీంతో జగన్ సర్కార్ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.
ఇలాంటి సమయంలో కేంద్రం వరుస ఊరటలిస్తోంది.
తాజాగా ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే అప్పుల పరిమితి పెంచిన కేంద్రం.. 48 గంటలు గడిచాయో లేదో మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో కొత్త అప్పులకు విధించిన మూలధన వ్యయం నిబంధనలో కొంత సడలింపు ఇచ్చింది. ఆ తర్వాత ఇవాళే 15వ ఆర్ధికసంంఘం నిధులు కూడా విడుదల చేసింది. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉన్న తొలి విడత రూ.581.70 కోట్ల నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది.

15వ ఆర్ధిక సంఘం 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మొదటి విడతగా రూ.581.70 కోట్ల నిధులను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ తెలిపారు. ఈ నిధుల్లో 70% అంటే రూ. 407.19 కోట్లు గ్రామపంచాయతీలకు, 15% అంటే రూ.174.51 కోట్లు జిల్లా పరిషత్ లకు, 15% అంటే రూ.174.51 కోట్లు మండల పరిషత్ లకు జమ చేశామని అయన తెలిపారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ద్వారా ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. గతేడాది ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల నిధులు ఆగినా ఆ తర్వాత కరోనా పరిస్ధితుల దృష్ట్యా కేంద్రం నిధులు ఆపలేదు. ఇప్పుడు మరోసారి నిధులు విడుదల చేయడంతో అప్పుల బాధల్లో ఉన్న ప్రభుత్వానికి భారీ ఊరట దక్కినట్లయింది. అదీ నెల రెండోవారమే కావడంతో ప్రభుత్వానికి ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కేంద్రం నుంచి వరుసగా విడుదలవుతున్న నిధులపై జగన్ సర్కార్ కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications