ఆంధ్రప్రదేశ్ కు వివిధ పథకాల కింద...రూ.796 కోట్లు విడుదల చేసిన కేంద్రం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ పథకాల కింద కేంద్రం రూ. 796.87 కోట్లు నిధులు విడుదల చేసింది. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
Recommended Video
ఆహార, ప్రజాపంపిణీశాఖ అత్యధికంగా బియ్యం పంపిణీ సబ్సిడీకి అడ్వాన్స్గా రాష్ట్రానికి రూ.693 కోట్లు విడుదల చేసింది. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద నూనెగింజలు, ఆయిల్పామ్ కోసం 2018-19కు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ రూ.26.26 కోట్లు విడుదల చేసింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ డెవల్పమెంట్ ప్రోగ్రాం కోసం వ్యవసాయ శాఖ 77.61 కోట్లు విడుదల చేసింది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వెంటనే నిధులు విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన ఈ లేఖలో పోలవరం నిర్మాణానికి 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు ఆమోదించే లోగా తక్షణం రూ.10వేల కోట్లు విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. 2010-11 అంచనాల ప్రకారం ఇంకా రూ.431.27 కోట్లు, ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1504.14 కోట్లు...మొత్తం రూ.1935.41 కోట్లు ఎపికి రావాలి...ఈ నిధులన్నీ తక్షణం అందించే ఏర్పాటు చేయాలని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం.
అయితే కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిదులు విడుదల అవుతున్నట్లు తెలిసి చంద్రబాబు లేఖ రాశారా? లేక...చంద్రబాబు లేఖ గురించి తెలిసి కేంద్రం ఈ నిధులు విడుదల చేసిందా? ..అనే విషయం రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పోలవరం ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేస్తుందో లేదో తెలియదు కానీ మరికొన్ని పధకాల కోసం అయితే మాత్రం కేంద్రం మరిన్ని నిధులు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.