ఏపీ పోలీసులపై కేంద్రం నజర్-త్వరలో కొందరు రీకాల్-సీఎం రమేష్ సంచలన కామెంట్స్
ఏపీలో పోలీసుల తీరుపై హైకోర్టుతో పాటు పలు కోర్టులు నిత్యం మొట్టికాయలు వేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇవాళ వారిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ పోలీసులపై దృష్టిపెట్టిందని, త్వరలో కొందరు అధికారుల్ని వెనక్కి పిలిపించే అవకాశం ఉందని ఆయన ఇవాళ వెల్లడించారు. దీంతో సీఎం రమేష్ వ్యాఖ్యలపై కలకలం రేగుతోంది. ముఖ్యంగా జగన్ సర్కార్ మాట వింటూ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులపై కేంద్రం ఆగ్రహంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ పోలీసులపై సీఎం రమేష్ ఫైర్
ఏపీలో పోలీసుల వ్యవహారశైలిపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎందుకు వ్యవహరించడం లేదని సీఎం రమేష్ ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి, పోతాయి వ్యవస్ధలు ముఖ్యమనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసు అధికారుల విషయంలో కేంద్రం సీరియస్ గా ఉన్న విషయాన్ని సీఎం రమేష్ గుర్తు చేశారు.
త్వరలో ఏపీ పోలీసు వ్యవస్ధ ప్రక్షాళన
ఏపీ పోలీసుల వ్యవహారశైలిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. వారిని కేంద్రం టెలిస్కోప్ తో చూస్తోందని, త్వరలో ఏపీ పోలీసు వ్యవస్ధను ప్రక్షాళన చేయబోతోందని రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని, అలాంటి వారి విషయంలో ఇతర రాష్టాల్లో కేంద్రం ఎలా వ్యవహరిస్తోందో తెలుసుకోవాలని సీఎం రమేష్ సూచించారు. ఏపీలోనూ అలాంటి చర్యలే ఉంటాయని రమేష్ స్పష్టం చేశారు. పోలీసులు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
అవసరమైతే ఐపీఎస్ ల రీకాల్
ఏపీలో పోలీసు అధికారులు ప్రభుత్వం చెప్పినట్టల్లా వింటూ విపక్షాల్ని ఇబ్బందిపెడుతున్నాయని, అలాంటి ఐపీఎస్ అధికారుల్ని రీకాల్ చేసే అవకాశం ఉందని సీఎం రమేష్ వెల్లడించారు. బెంగాల్ తో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో కేంద్రం ఇప్పటికే అలాంటి చర్యలు చేపడుతోందని సీఎం రమేష్ గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి చర్యలే చేపట్టబోతున్నట్లు సీఎం రమేష్ వెల్లడించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు. దీంతో రమేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జగన్ అర్ధం చేసుకుంటారనే
వైఎస్ జగన్ తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి మెల్లగా అర్ధం చేసుకుంటారని కేంద్రం, బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూశాయని, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాల్ని అవలంబిస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. ప్రభుత్వానికి సినిమా రేట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఎందుకు లేదని సీఎం రమేష్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు, అవినీతిపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.