మోడీ వైజాగ్ టూర్ : చివరి నిమిషంలో ట్విస్టులు- తెరపైకి రోడ్ షో- రైల్వే జోన్ కు షాక్..!
ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖ రాబోతున్నారు. ఈ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే బీజేపీ, వైసీపీ నేతలు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటిస్తున్నారు. అయితే ఇందులో చివరి నిమిషంలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ అధికారిక పర్యటను వైసీపీ హైజాక్ చేస్తోందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ వైజాగ్ టూర్
ప్రధాని మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్ ను బీజేపీ నేతలు గత వారమే వెల్లడించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ప్రకటించారు. అయితే ఇందులో ఏడుకీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేయబోతున్నట్లు వెల్లడైంది. ఈ ప్రకటనల తర్వాత హైకోర్టు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రధాని షెడ్యూల్ లో భోగాపురం పోర్టు శంఖుస్ధాపనను కూడా చేర్చాలని వైసీపీ పట్టుబడుతోంది. అటు బీజేపీ కూడా ప్రధాని టూర్ లో తన మార్కు ఉండాలని భావిస్తోంది. దీంతో చివరి నిమిషంలో పలు మార్పులు తప్పడం లేదు.
మోడీ టూర్ లోకి రోడ్ షో
ప్రధాని మోడీ వైజాగ్ టూర్ లోకి ఇప్పుడు అనూహ్యంగా రోడ్ షో వచ్చి చేరింది. ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖకు రాగానే నగరంలో సాయంత్రం రోడ్ షో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మోడీ విశాఖకు, అలాగే ఏపీకి చేస్తున్నసాయాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఈ రోడ్ షో లేదు. కానీ చివరి నిమిషంలో బీజేపీ నేతలు పట్టుబట్టి దీన్నిచేర్పించినట్లు తెలుస్తోంది. ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ ప్రకటించారు.
నో విశాఖ రైల్వే జోన్, రాజధాని
ప్రధాని తన టూర్ లో ఏడుకీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయబోతున్నారు. వీటిలో పలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కీలకమైన విశాఖ రైల్వే జోన్ కు మాత్రం ప్రధాని శంఖుస్ధాపన చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ తన ప్రెస్ మీట్లో ఇవాళ వెల్లడించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ అయినప్పటికీ ఇప్పటికీ కేంద్రం రైల్వే జోన్ పై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానితో శంఖుస్ధాపన చేయిస్తే ఆ మేరకు ఒత్తిడి ఉంటుందని వైసీపీ సర్కార్ భావించింది. కానీ ఓసారి ప్రధాని శంఖుస్ధాపన చేస్తే దాన్ని పూర్తి చేసే వరకూ బీజేపీపై ఒత్తిడి ఉంటుందని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అంశం కూడా ప్రధాని టూర్ లో ఉండబోదని జీవీఎల్ ప్రకటించారు.
వైసీపీ హైజాక్ కు కేంద్రం చెక్ ?
విశాఖలో ప్రధాని మోడీ టూర్ అధికారిక కార్యక్రమం కాబట్టి ఇతర పార్టీల్ని దీనికి దూరంగా ఉంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ప్రధానికి ఉన్నప్రోటోకాల్ దృష్టా అధికారిక పదవుల్లో లేని బీజేపీ నేతల్ని ఈ టూర్ కు వైసీపీ సర్కార్ దూరంగా ఉంచడం ఖాయం. దీంతో బీజేపీ మార్క్ మిస్సవుతోంది. అలాగే వైసీపీ హైజాక్ చేసినట్లవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రధాని టూర్ లో రోడ్డుషో ఏర్పాటుతో పాటు ప్రతీ చోటా కేంద్రం, బీజేపీ మార్క్ కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేతల ప్రతిపాదనలకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.