మోడీ రాక వేళ అమరావతికి మరో గుడ్ న్యూస్..!
ఏపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతికి వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ సాగుతోంది. త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. అదే సమయంలో ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చిన రుణం రూ.4285 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇదే క్రమంలో అమరావతికి కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్ లభించింది.
అమరావతిలో త్వరలో కేంద్ర విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ఇవాళ వెల్లడించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాస్ట్ పోర్ట్ కార్యాయాలన్నీ ఆధునీకరణతో కార్పొరేట్ ఆఫీసులుగా తయారు అవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ సహకారంతో ఏపీ కూడా అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. ఇదే క్రమంలో విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం కూడా రాబోతోందన్నారు.

విజయవాడలో ఆధునీకరించిన పాస్ పోర్ట్ సేవా కేంద్రం, రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని కేంద్రమంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి కేశినేని చిన్ని ఇవాళ ప్రారంభించారు. పాస్ పోర్ట్ తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రాన్ని తీర్చిదిద్దిన రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ కె.శివహర్షను ఆయన కొనియాడారు. వైజాగ్ లో పాస్ పోర్ట్ సేవా కేంద్రం వుండటంతో పాస్ పోర్ట్ జారీ కావటంలో ఆలస్యం జరిగేదని, ఇకపై ఆలస్యం ఉండదని, వారం పదిరోజుల్లో పాస్ పోర్ట్ జారీ అవుతుందన్నారు.

వైజాగ్ తో పాటు విజయవాడ లో కూడా పాస్ పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి రావటం ఈ ప్రాంతం ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కేశినేని తెలిపారు. పాస్ పోర్ట్ కోసం ప్రతి రోజు 600 నుంచి 2000 మంది దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం 3లక్షల పాస్ పోర్టులు ఈ కార్యాలయం నుంచే మంజూరు అవుతున్నాయన్నారు. అమరావతిలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభానికి లైన్ క్లియర్ చేసిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి కీర్తి వర్థన్ సింగ్ కు ఎంపీ కేశినేని ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications