కమలం నీడన టీడీపీ అజెండా అమలు చేస్తున్నారా? చంద్రబాబుది చారిత్రక తప్పు
అమరావతి: పోలవరం ప్రాజె క్టు కాంట్రాక్టు నుంచి నవయుగను తప్పించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తోంది. తెలుగుదేశం కంటే ఎక్కువగా భారతీయ జనతాపార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దాని నిర్మాణ పనులు మొత్తం కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పరిధిలోనివని అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పడం ఆశ్చర్య పరుస్తోంది. సరిగ్గా రెండు నెలల కిందట తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన సుజనా చౌదరి.. కాషాయ కండువాను కప్పుకొన్న అనంతరం ఈ ప్రకటన చేయడం ముక్కు మీద వేలేసుకునేలా చేస్తోంది. కేంద్రం పరిధిలో కొనసాగాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా బదలాయించుకుంది. అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
ఏకపక్ష నిర్ణయాలు కుదరవ్..
కేంద్రానికి కనీస సమాచారం ఇవ్వకుండా నవయుగ సంస్థను కాంట్రాక్టు పనుల నుంచి తప్పించడం తప్పేనని సుజనా చౌదరి ఎదురుదాడికి దిగారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, దీని నిర్మాణానికి తమ ప్రభుత్వమే నిధులిస్తోందని అన్నారు. పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అంతే తప్ప.. కీలక నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ లేదని అన్నారు. నిర్మాణ పనుల్లో అవకతవకలు చోటు చేసుకుంటే.. వాటిని తేల్చడానికి కాగ్ ఉందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును కక్షతో రద్దుచేసిందని సుజనా చౌదరి విమర్శించారు. ఇది బీజేపీ, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కాదని, ఎంపీగా తన సొంత అభిప్రాయమని ఆయన చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చారు.

నీతి ఆయోగ్ సూచనల మేరకే..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నీతి ఆయోగ్ సిఫారసుల మేరకే ఇదివరకు ఎన్డీఏ-1 ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని సుజనా చౌదరి చెప్పారు. లోక్సభలో టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ కూడా కాంట్రాక్టు రద్దును ఆక్షేపించారని అన్నారు. కాంట్రాక్టు రద్దు వ్యవహారంపై గజేంద్రసింగ్ త్వరలోనే సమీక్షిస్తారని చెప్పారు. కాంట్రాక్టును రద్దు చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉన్నదో లేదో సమగ్రంగా సమీక్షించాక.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తేలుతుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని సుజనా తెలిపారు. ఆయన అనాలోచిత నిర్ణయాలు, చర్య వల్ల పోలవరం నిర్మాణంలో జాప్యం నెలకొంటోందని అన్నారు. దీనివల్ల వ్యయం బాగా పెరిగి మరింత భారమవుతుందని చెప్పారు. ఎన్డీఏకి దూరం కావొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను అనేక పర్యాయాలు చెప్పానని, అయినా తన మాట ఆయన పట్టించుకోలేదని సుజనా తెలిపారు. ఎన్డీఏకి దూరమై చంద్రబాబు చరిత్రాత్మకమైన తప్పు చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications