ఏపీలో లక్షా 20 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టులు- రాజ్యసభలో వెల్లడి
అమరావతి/న్యూఢిల్లీ: సాగరమాల ప్రాజెక్ట్ కింద ఏపీలో 1,20,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా 113 ప్రాజెక్టులను చేపట్టినట్లు పేర్కొంది. ఇందులో 36,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని వివరించింది.
రాజ్యసభలో వైఎఎస్ఆర్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. సాగరమాల ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు వివరించారు.

సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్ట్ అథారిటీ, జాతీయ రహదారుల అథారిటీ, పబ్లిక్ వర్క్స్, రైల్వేలు, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వంటివి ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు సొనొవాల్ తెలిపారు.
రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే 32,000 కోట్ల రూపాయలు విలువ చేసే 36 ప్రాజక్టులు పూర్తి అయ్యాయని, మిగిలిన 91,000 కోట్ల రూపాయలు విలువ చేసే 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. పోర్టుల ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు, పరిశ్రమల అభివృద్ధి, కోస్తా తీర ప్రాంతాల అభివృద్ధి.. వంటి 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని సొనొవాల్ తెలిపారు.
అలాగే 17,741 కోట్ల రూపాయలతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలో ఉన్నాయని ఆయన వివరించారు. 73,527 కోట్ల రూపాయలతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నాయని శర్బానంద సొనొవాల్ చెప్పారు. పనులు కొనసాగుతున్నాయని, ఎలాంటి ఆటంకాలు ఉండట్లేదని, నిర్ణీత గడువులోగా పూర్తవుతాయని అంచనా వేస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications