'మూడు' నిబంధనతో చెక్: చంద్రబాబుకు మోడీ ఝలక్
న్యూఢిల్లీ: విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్. ఆర్థిక లోటు నేపథ్యంలో అప్పు తీసుకొని ముందుకు వెళ్తామనే చంద్రబాబు ప్రభుత్వ యత్నానికి కేంద్రం అడ్డు చెప్పింది. ఎఫ్ఆర్బీఎం పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం అంగీకరించలేదు.
నిబంధనలను చూపించి రాష్ట్ర ప్రభుత్వ రుణ ప్రయత్నాల పైన కేంద్రం నీళ్లు చల్లింది. ఇప్పటికే ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా సాయం చేయాల్సి ఉంది. విభజన నేపథ్యంలో కేంద్రం ఏపీకి కొన్ని హామీలు నెరవేర్చవలసి ఉంది. వాటిని విడతలవారీగా నెరవేరుస్తున్నట్లు చెబుతోంది.
ఆర్థిక కష్టాల నేపథ్యంలో అప్పులు తీసుకొని నెట్టుకొద్దామని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కేంద్రానికి ఏపీ మొరపెట్టుకోగా... నో చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు అన్ని రాష్ట్రాల ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతం వరకు పెంచాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది.
ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్డీపీ) 3శాతంగా ఉంది. ఆ పరిమితి పెరిగితే రాష్ట్రాలకు ఎక్కువ అప్పులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు పరిమితి పెంచిన కేంద్రం ఏపీకి మాత్రం.. 14వ ఆర్థిక సంఘం నిబంధలను చూపించి పెంచడం లేదు.
ఎఫ్ఆర్బీఎం పెంపుకు 14వ ఆర్థిక సంఘం 3 నిబంధనలు విధించింది. మొదటిది రాష్ట్రం తీసుకున్న రుణ మొత్తం రాష్ట్ర జిఎస్డీపీలో 25 శాతం కంటే మించవద్దు. ఏపీ జిఎస్డీపీని రూ.6.83 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.1.9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి.
జిఎస్డీపీలో ఇది దాదాపు 28 శాతంగా ఉంది. 2013-14 వరకు రాష్ట్రం తీసుకున్న అప్పులు జీఎస్డీపీలో 22 శాతం ఉండగా, ఆ తర్వాత పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రుణ శాతాన్ని 27.99 సాతంగా చూపించారు. అంతకుముందు ఏడాది 28.19గా, అంతకుముందు ఏడాది 29.36గా చూపించారు. 25 శాతం దాటిందజి కాబట్టి పెంచేందుకు కేంద్రం అంగీకరించలేదు.