అమరావతిలో కార్యాలయాలు తెరవండి: దావోస్లో పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు(ఫొటోలు)
దావోస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యంత అధునాతన ప్రపంచ శ్రేణి రాజధానిగా నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలను ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో బుధవారం జరిగిన 46వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు.
భారత్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న రాష్ట్రమని, తమ రాష్ట్రానికి 974 కిలోమీటర్లు పొడవైన తీరం ఉందని, తూర్పు తీరానికి ముఖ ద్వారమైన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చిందని సిఎం పేర్కొన్నారు.
రాజధాని అమరావతిని ప్రపంచ శ్రేణి నగరంగా నిర్మించబోతున్నామని అన్నారు. హరిత, జల వనరుల నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పారిశ్రామిక దిగ్గజాలైన మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అని చంద్రబాబు పేర్కొంటూ ‘మీరంతా మా రాష్ట్రానికి రండి, కార్యాలయాలు ప్రారంభించండి' అని కోరారు.
పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఆటంకం ఉండదని, పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానం అమలుచేస్తోందని అన్ని రకాల అనుమతులు ఒకే చోట ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పరిపాలనలో జరిగే ప్రతి అంశాన్ని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆన్లైన్లో పెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
సదస్సులో భారత పారిశ్రామిక దిగ్గజాలు బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, ఇన్ఫోసిస్ ఎండి (ఇండో అమెరికా) విశాల్ శిక్కా, భారతి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పిరమల్ గ్రూప్ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్, సుజ్లాన్ అన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు తులసి తంతి తదితరులున్నారు. సిఎం బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేశ్ తదితరులు ఉన్నారు.