చదలవాడ కంటతడి: పదవీకాలం పూర్తయిందనా? లేక తన్మయత్వమా?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ధర్మకర్తల మండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. శ్రీవారు.. ఒక సామాన్య భక్తుడిని సంవత్సరం పాటు తన చెంత పని చేయించుకున్నారంటూ బోరున విలపించారు. కాగా, అక్కడున్న వారు చదలవాడ తీరుతో ఆశ్యర్యానికి గురయ్యారు. అన్నమాచార్య వర్ధంతి వేడుక సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
కాగా, లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటే వారికి అన్ని వసతులు కల్పిస్తూ టిటిడి ప్రతిష్టను ఇనుమడింపజేస్తోంది టిటిడి ఉద్యోగులేనని చదలవాడ కృష్ణమూర్తి కొనియాడారు. ఒక్క తిరుపతికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతండటంపై చదలవాడ ఆనందం వ్యక్తం చేశారు.
అమెరికా లాంటి పెద్ద దేశాల్లో కూడా శ్రీవారి కళ్యాణాలు నిర్వహించమని అక్కడి తెలుగువారు తమను కోరుతున్నారని, దీంతో స్వామి వారి విగ్రహాలను అక్కడే ఉంచి వచ్చామని తెలిపారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా తిరుమల శ్రీవారు అంటే తెలియని వారుండరని భావోద్వేగానికి గురయ్యారు.
కాగా, చదలవాడ కంటతడి పెట్టడం చూసిన భక్తులు, టిటిడి ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చదలవాడ తన పదవీకాలం అయిపోతుందని విలపిస్తున్నారా? లేక స్వామివారి కీర్తి గురించి మాట్లాడుతూ తన్మయత్వంతో కన్నీటి పర్యాంతమయ్యారా? అన్నదానిపై చర్చించుకున్న భక్తులు, ఇతర అధికారులు మిన్నకుండిపోయారు. కాగా, చదలవాడ భావోద్వేగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.