పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి దగ్గరయ్యేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. పవన్..బీజేపీని దూరం చేసుకున్న కారణంగానే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామనే భావనలో ఉన్న టీడీపీ అధినాయకత్వం..తిరిగి బంధం ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన నవంబర్ 3న పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా మార్చ్ కు నిర్ణయించారు. అందులో పాల్గొనాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను ఫోన్ చేసి ఆహ్వానించారు.
అయితే, తొలుత సరే అన్నా..ఆ తరువాత బీజేపీ తాము సొంతంగానే నిరసన కొనసాగిస్తామని ప్రకటించింది. అనేక తర్జన భర్జనల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు తాము పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిర్వహిస్తున్న విశాఖ ర్యాలీలో పాల్గొంటున్నామని..పార్టీ నేతలను పంపిస్తున్నామని స్వయంగా ప్రకటించారు. దీంతో..తిరిగి జనసేన..టీడీపీ గురించి అధికార వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

పవన్ ర్యాలీకి టీడీపీ హాజరు..
ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ప్రభుత్వ తీరుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3న విశాఖలో భారీ మార్చ్ నిర్వహణకు నిర్ణయంచారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొనాల్సిందిగా పవన్ స్వయంగా చంద్రబాబు..కన్నా లక్ష్మీనారాయణ తో సహా వామపక్షాలు.. లోక్ సత్తా నేతలను ఫోన్ చేసి కలిసి రావాలని ఆహ్వానించారు. అయితే, కొన్ని పరిణామాల తరువాత బీజేపీ తాము నవంబర్ 4న ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని..పవన్ తో కలిసి వేదిక పంచుకొనే అవకాశం లేదని తేల్చి చెప్పింది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు దీని మీద పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.
గత ఎన్నికల్లో పవన్..బీజేపీతో కలిసి ఉంటే ఈ రకమైన ఫలితాలు వచ్చేవి కావనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పుడు స్వయంగా పవన్ ఆహ్వానించటంతో మద్దతు ఇవ్వటం ద్వారానే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని..భవష్యత్ సమీకరణాల్లో ఉపకరిస్తుందనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే బీజేపీ పూర్తిగా దూరం పాటిస్తున్న సమయంలో ..పవన్ తో సంబంధాలు అవసరమని..ఇప్పుడు ఈ కార్యక్రమం వరకే పరిమితం అవుతూ..భవిష్యత్ లో టీడీపీ నిర్వహించే నిరసనలకు జనసేన మద్దతు కోరే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో..పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా తాము పవన్ కళ్యాణ్ నిర్వహించే ర్యాలీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. విశాఖలో జరిగే ఈ నిరసన మార్చ్ కు పార్టీ నుండి ప్రతినిధులను పంపిస్తున్నామని స్పష్టం చేసారు.
భావసారూప్యత పార్టీలతో కలసి పని చేస్తాం..
చంద్రబాబు ప్రకటనకు ముందుగా మాజీ మంత్రి లోకేశ్ సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. భావసారూపత్య పార్టీలతో కలిసి పని చేయటానికి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో..అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేనతో కలిసి ఉండటం మంచిదనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తం అవుతోంది.
అయితే, ఇప్పటికీ చంద్రబాబుద..పవన్ కళ్యాణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడుగా పేర్కొంటున్నారు. ఇక, ఇప్పుడు స్వయంగా చంద్రబాబు జనసేన పార్టీ లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించటంతో అధికార వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications