వరద బాధితులకు నష్ట పరిహారం ప్యాకేజీ ఖరారు..!!
ఏపీలో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడిప్పుడే బాధితులు కోలుకుంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో నష్టపోయిన వారికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిహార ప్యాకేజీని ప్రకటించారు. అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ లోపు వరద పరిహారం అందిస్తామని తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
అండగా నిలుస్తాం
ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు బాధితులకు భరోసా ఇచ్చారు. కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పర్యటించిన సీఎం కొల్లేరు, తాండవ వరదపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏలేరు వరద ముంపుతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు, ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం, దుస్తులు అందిస్తామని ప్రకటించారు. పంట నష్టం వేగంగా పూర్తి చేసి పరిహారం ఇస్తామని వారికి ధైర్యం చెప్పారు.

బాధితులకు పరిహారం
నేటి (గురువారం) నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ చేస్తామని, వరదకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పదివేల సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు కట్టిం చి ఇస్తామని, తోపుడు బండ్లు దెబ్బతిన్న వారికి కొత్తవి ఇస్తామన్నారు. ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు పాడైతే పదివేలు సాయం చేస్తామని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ.25వేల సాయం అందిస్తామని వివరించారు. ఏలేరుకు వరద రాకుండా ఆధునికీకరణ పనులు చేపడతామని చెప్పారు.
ఆదుకుంటాం
గతంలో తితలీ తుఫానుకు టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు రూ.20వేలు సా యం చేసిన విషయం గుర్తుచేశారు. కానీ జగన్ పాలనలో రూ.20 వేలను రూ.16 వేలకు తగ్గించారని, తర్వాత వెయ్యి పెంచారని వివరించారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో లెక్కిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే ప్రజలు చెబితే, సరిదిద్దుకుంటామని.. దీనికోసమే త్వరలో యాప్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications