ఢిల్లీలో చంద్రబాబు దీక్ష : కేంద్రానికి- జగన్ కి చెక్ : పొలిటికల్ ఇమేజ్ లక్ష్యంగా..!
ముఖ్యమంత్రి హోదాలో ఏపి సీయం చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు దిగాలని భావిస్తున్నారు. ఏపికి కేంద్రం అన్యాయం చేస్తుందని కొంత కాలంగా చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి..ఇక ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాలు కేంద్రానికి చివరివి కావటంతో..ఇక ఎన్నికల ముందు ఢిల్లీలో దీక్ష చేయటం ద్వారా అటు జాతీయ స్థాయిలో..ఇటు రాష్ట్ర స్థాయిలో ఏపి సమస్యలకు గుర్తింపు రావటంతో పాటుగా.వైసిపికి చెక్ పెట్టటం ... అదే సమయంలో రాజకీయంగానూ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో..
ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన సమయం నుండి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపి పునర్విభజన చట్టం ప్రకారం ఏపికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తోందని ఇటు ఏపిలో..అటు ఢిల్లీలోనూ విమర్శలు చేస్తున్నారు. కేంద్రం మాత్రం తాము దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని నిధులు ఏపికి ఇచ్చామని చెబుతోంది. ఏపికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా తన జన్మదినం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కేంద్రంగా ఒక రోజు దీక్ష చేసారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు నిర్వహించారు. తాజాగా, కేంద్రం పై పోరాటం లో చివరి అంకంగా..ఎన్నికల ముందు ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీ ఎంపీలతో చర్చించారు.
సీయం గా ఒక్క రోజు దీక్ష
ఏపి ముఖ్యమంత్రి హోదా లో కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశాల చివరి రోజుక ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేయా లని సీయం భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ఎంపీల సమావేశంలో ప్రస్తావించారు. ఎంపీలు సైతం ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేస్తే మద్దతుగా ఉన్న 21 పార్టీల నేతలు మద్దతుగా నిలుస్తారని కేంద్రం పై ఒత్తిడి పెరుగుతుందని సూ చించారు. ముఖ్యమంత్రి తో పాటుగా పార్టీ ఎంపీలు..రాష్ట్రంలోని టిడిపి ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు అంతా ఈ దీక్షలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా జాతీయ స్థాయిలో ఇప్పటికే మిత్రులుగా ఉన్న పార్టీల నేతల హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించిన చంద్రబాబు..కేంద్రం స్పందించకపోతే అప్పుడు చివరి రోజున దీక్షకు దిగాలనే ఆలోచనలో ఉన్నారు.
వైసిపి కి చెక్..రాజకీయంగా మైలేజ్
ఢిల్లీలో ముఖ్యమంత్రి హోదా లో దీక్ష చేయటం ద్వారా ప్రతిపక్ష వైసిపి కి చెక్ పెట్టినట్లవుతుందని టిడిపి అధినేత భావిస్తున్నారు. జగన్ సైతం హోదా కోసం దీక్ష చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలి.. ఎక్కడ చేయాలి అనే దాని పై ఇంకా నిర్ణయానికి రాలేదు. దీంతో..ముఖ్యమంత్రి వేగంగా పావులు కదిపారు. ఎన్నికల సమయాన వైసిపికి అవకాశం ఇవ్వకుండా..తానే సీయం హోదాలో ఢిల్లీలో దీక్ష చేస్తే రాజకీయంగా జాతీయ స్థాయిలో ఇటు ఏపిలోనూ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అయితే, దీక్ష చేస్తే కేంద్ర స్పందన ఎలా ఉంటుందనే దాని పైనా చర్చలు చేస్తున్నారు. పక్కా వ్యూహాత్మకంగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. ఢిల్లీలో దీనిని అమలు చేసే విధంగా టిడిపి ప్రణాళికలు సిద్దం చేస్తోంది.