చంద్రబాబు కీలక నిర్ణయం - కుప్పం కేంద్రంగా : జూన్ 5న ముహూర్తం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఈ మధ్య కాలంలో తరచూ పర్యటిస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత కుప్పం పైన ఆయన మరింత ఫోకస్ పెంచారు. ఇక, తాజాగా స్థానిక సంస్థలు - మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంకు రెగ్యులర్ గా వెళ్లటం..అక్కడ పార్టీ నేతలతో కలిసి నియోజకవర్గంలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఆయన తన సొంత నియోజకవర్గంలోనే సొంత ఇంటి నిర్మాణానికి నిర్ణయించారు. దాదాపు 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసారు.
కుప్పంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈనెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
ఇక్కడ గృహంతోపాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయ భవనం కూడా నిర్మించనున్నారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికల నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మారుతున్న సమీకరణాలతో
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసారు. కానీ, ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకోలేదు. అయితే, తాజాగా మారుతున్న రాజకీయ పరిస్థితులతో చంద్రబాబు కుప్పంలోనూ ఇల్లు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు..కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లోనూ చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ విజయం సాధించింది.
దీంతో..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరువేస్తామని వైసీపీ ధీమాగా చెబుతోంది. ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పైన ప్రత్యేకంగా శ్రద్ద చూపుతున్నారు. తాజాగా, జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో కుప్పం ను కొత్త రెవిన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేసారు.
ఇక స్వయంగా అన్నీ తానై...
ఇప్పటి వరకు కుప్పంలో తన అనుచరులు..పార్టీ నేతలతో చంద్రబాబు అక్కడ కాలు పెట్టకుండానే విజయం సాధిస్తూ వచ్చారు. కానీ, చిత్తూరు రాజకీయాల్లో చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతున్న సమయంలో స్థానికంగా ప్రజలకు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇవ్వటంతో పాటుగా..కుప్పం ప్రజలతోనే తాను కలిసి ఉంటాననే విధంగా ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ సాగుతోంది. అయితే, ఏడు పర్యయాలు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు అక్కడ సొంత ఇంటి నిర్మాణం పై నిర్ణయం తీసుకోవటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.