ఢిల్లీలో చంద్రబాబు మరో దీక్ష : అసలు లక్ష్యం అదేనా : ఏపి ఫలితాలే డిసైడింగ్ ఫ్యాక్టర్..!
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీలో దీక్షకు సిద్దమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపికి కేంద్ర హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేసారు. ఇక, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ.. వీవీ ప్యాట్స్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలనే డిమాండ్తో మిత్రపక్షాలతో కలిసి ఈ దీక్షకు నిర్ణయించారు. అయితే, ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి దీక్ష ఆలోచన పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో మరో దీక్ష..
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మరో దీక్షకు సిద్దమయ్యారు. ఏపిలో ఇసి తీసుకున్న నిర్ణయాల నాటి నుండి ఎన్నికల సంఘం పైనా..ఇవియంల నిర్వహణ పైనా చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం రిమోట్ మోడీ ఆపరేట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇక, ఇవియంల పని తీరు పైన జాతీయ స్థాయిలో తమ విమర్శలు కొనసాగించారు. వీవీప్యాట్స్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలంటూ సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఇదే డిమాండ్తో మరో సారి నిరసన దీక్షకు చంద్రబాబు సిద్దమయ్యారు. అందుకోసం బీజేపీయతర పార్టీల నేతలతో కలిసి దీక్ష చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు కానుంది.
అసలు లక్ష్యం అదేనా..
ఏపిలో ఎన్నికలు ముగిసాయి. జాతీయ స్థాయిలో కొంత కాలంగా యాక్టివ్గా ఉంటున్న చంద్రబాబు..దేశ రాజకీయాల్లో తిరిగి క్రియా శీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. ఏపిలో ఫలితాలు ఎలా ఉన్నా..జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక రాజకీయాల్లో చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించి..బీజేపీయతర పక్షాల్లో పట్టు సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మోదీకి ధీటుగా ప్రధాని ఎవరనే అంశాలోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగానే సమాధానం ఇస్తున్నారు. తమ తొలి లక్ష్యం మోదీని ఓడించటమని..ఆ తరువాత ప్రధాని ఎవరనేది తాము నిర్ణయించుకుంటామని చెబుతున్నారు. యునైటెడ్ ఫ్ర్ంట్ కన్వీనర్గా నాడు జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్ర మరోసారి బాబు కోరుకుంటున్నారంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నా..చంద్రబాబు వారి కంటే మోదీ పైన ఆరోపణల్లో ఒక అడుగు ముందున్నారు. ఇక, లోక్సభ ఫలితాలు వచ్చే లోగా తన స్థానం ఢిల్లీ రాజకీయాల్లో సుస్ధిరం చేయాలనేది బాబు ఆలోచనగా కనిపిస్తోంది.
ఏపి ఫలితాలే ప్రామాణికం..
ఏపి ఎన్నికల ఫలితాలే చంద్రబాబు రాజకీయ అడుగులకు ప్రామణికంగా మారనున్నాయి. చంద్రబాబు ఇప్పటికీ ఏపిలో తాము తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని ధీమాతో ఉన్నారు. అదే సమయంలో మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను కూడ గట్టటంలో ముందున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా.. ఏపిలో అసెంబ్లీ ఫలితాలే చంద్రబాబు రాజకీయంగా తీసకొనే తదుపరి నిర్ణయాలకు కీలకం కానున్నాయి. జాతీయ స్థాయిలో తిరిగి మోదీ అధికారంలోకి వస్తే..ఏపిలో టిడిపి అనుకూల ఫలితాలు వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో..ఫలితాలు వ్యతిరేకంగా వస్తే మాత్రం 40 ఏళ్ల అనునభం ఉన్న చంద్రబాబు రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది మాత్రం ఆసక్తి కరమే..