ఎంతమంది బలి కావాలి: వారం రోజుల్లో పదిమంది: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..!
Recommended Video
ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి మరో కార్మికుడు ప్రాణం బలిగొందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో తాపీమేస్త్రీ ఆత్మహత్య కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 10 మంది కార్మికులు మృతిచెందారని చెప్పారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల బాధ్యతారాహిత్యానికి ఇంకెంత మంది బలికావాలని నిలదీసారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోల ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కధనాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు టీడీపీ అధినేత పార్టీ నుండి లక్ష రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందించారు.
ఇద్దరు కార్మికుల ఆత్మహత్య..
ఏపీలో ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. టీడీపీ చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు పది మంది ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు కార్మికులు ఇదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పనులు లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా గుంటూరు జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పొన్నూరులో పురుగు మందు తాగి భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో కూడా మరో తాపీ మేస్త్రీ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే జిల్లా గోరంట్లలో ఇసుక కొరత కారణంగా..పనులు లేక ఆర్దిక ఇబ్బందులతో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కార్మికుడి కుటుంబానికి టీడీపీ అధినేత పార్టీ నుండి ఆర్దిక సాయంగా లక్ష రూపాయాలు అందించారు. అయితే, ఈ రకమైన ఆత్మహత్యలు గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సమస్య మీద టీడీపీతో సహా జనసేన..బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని..ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ ను ఇసుక సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టీడీపీ హాయంలో ఇసుక అవినీతి పైన నాడు ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అదే సమస్య ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తోంది. వరదల కారణంగా ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభుత్వం లో అవినీతి..అసమర్ధత కారణంగానే ఇసుక కొరత ఏర్పడి లక్షలాది భవన కార్మికులు రోడ్డున పడ్డారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
జనసేన అధినేత విశాఖలో ఇదే సమస్య మీద లాంగ్ మార్చ్ నిర్వహణకు సిద్దమయ్యారు. ఆయనకు టీడీపీ మద్దతు ప్రకటించింది .ఇక, బీజేపీ సైతం నిరసనలకు సమాయత్తం అవుతోంది. టీడీపీ నేతలు ప్రతీ రోజు ఇదే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక, కార్మికుల ఆత్మ హత్యల అంశంతో ప్రభుత్వం మరింతగా ఇబ్బంది పడుతోంది. అయితే, ఇసుక సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఇసుక వారోత్సవాలు ప్రకటించారు. ఇంకా అది ప్రారంభం కాలేదు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఏపీలో ఇసుక చుట్టూ రాజకీయాలు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications