చంద్రబాబు గ్రామం నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం కోసం తీర్మానం.. కట్టుబడి ఉన్నాం: ఆదిమూలపు
జాతీయ విద్యా విధానంలో భాగంగా ఐదో తరగతి వరకు మాతృభాషను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ మీడియానికే కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. గురువారం అమరవాతిలో గల ఉన్నత విద్యామండలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని.. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం తీసుకున్నామని వివరించారు.

97 శాతం మంది పేరంట్స్..
97 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియమే కావాలని కోరారని మంత్రి సురేశ్ గుర్తుచేశారు. అంతేకాదు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గ్రామం నారావారిపల్లెలో కూడా ఇంగ్లీషు మీడియం కావాలని తీర్మానం చేసి పంపించారని గుర్తుచేశారు. జాతీయ విద్యా విధానం ప్రకారం తెలుగు భాష ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నూతన పాలసీని అడ్డుపెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.

ఇదివరకే జగన్ చెప్పారు..
విద్యావిధానంలోని చాలా అంశాలు సీఎం జగన్ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని సురేశ్ వివరించారు. అందులోని చాలా అంశాలను ఇప్పటికే తాము అమలు చేశామని చెప్పారు. తొలుత రాష్ట్రంలో మానవ వనరులశాఖను విద్యాశాఖగా పేరు మార్చామని.. ఇప్పుడు కేంద్రంలో పేరు మార్చారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా రూపాంతరం చేయాలని.. 6-8 తరగతులకు డిజిటల్ ఎడ్యుకేషన్, కోడింగ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభించాలని నిర్ణయించామని గుర్తుచేశారు. ఇప్పుడు వాటినే జాతీయ నూతన విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వం చెబుతోందని తెలిపారు.
Recommended Video

డిగ్రీ నాలుగేళ్లు అని...
డిగ్రీ కోర్సుల్లో సీబీసీఎస్ కింద ఆన్ జాబ్ ట్రైనింగ్కు సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారని సురేశ్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని కేంద్రం తమ పాలసీలో తీసుకొచ్చిందని వివరించారు. నాలుగేళ్ల డిగ్రీ పాలసీ కావాలని సీఎం జగన్ ముందుగానే సూచించారని తెలిపారు. అంతేకాదు కేంద్రానికి తాము ఇచ్చిన సూచనలు, సలహాలు నూతన విద్యా విధానంలో పొందుపరిచారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications